పాల్వంచ, నవంబర్ 10, ప్రజాజ్యోతి : రైతుల నుండి ధాన్యం సేకరణకు సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాల్వంచ తహసిల్దార్ రంగా ప్రసాద్ తో కలిసి కొత్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ.. సొసైటీ పరిధిలో పాల్వంచ మండలంలోని ప్రభాత్నగర్(రెడ్డిగూడెం), కారేగట్టు, సోములగూడెం, సంగెం, దంతెలబోరతో పాటు పట్టణ పరిధిలోని గుడిపాడులలో మొత్తం 6 కేంద్రాలు గురువారం ప్రారంభించబడ్డాయన్నారు. రైతులు దళారుల బారిన పడకుండా తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధరణి ప్రకటించి, సొసైటీల ద్వారా కొనుగోలు చేయిస్తున్నదన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి, ప్రభుత్వం నిబంధనల మేరకు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. ధాన్యం గ్రేడ్ ఏ రకం ధర రూ.2060లు, సాధారణ రకం ధర రూ.2040లుగా నిర్ణయించిందన్నారు. రైతులందరూ ఒకేసారి కాకుండా వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు కూపన్ పొంది, నిర్ణయించిన తేదీనే ధాన్యం కేంద్రానికి తీసుకురావాలన్నారు. మండలంలోని రైతులు సొసైటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రంగా ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి రవీంద్ర ప్రసాద్, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, వ్యవసాయ శాఖ అధికారి పి శంభో శంకర్, ఏఈఒ టి భాను, సొసైటీ డైరెక్టర్లు బుడగం రామ మోహన్ రావు, జరబన సీతారాంబాబు, చౌగాని పాపారావు, సీఈఓ జి. లక్ష్మీనారాయణ, సురేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
- 3 views