'ప్రజాస్వామ్యమా' పారాహుషార్‌..!!

Submitted by Praneeth Kumar on Tue, 26/12/2023 - 09:16
Is Democracy exists

'ప్రజాస్వామ్యమా' పారాహుషార్‌..!!

ఖమ్మం, డిసెంబర్ 26, ప్రజాజ్యోతి.

ప్రజల బాగుకోసం ప్రభుత్వమూ, విపక్షం కలిసి నడుస్తూ చట్టసభల గౌరవప్రతిష్ఠలను కాపాడుకోవాలి. లేకపోతే అవి కుప్పకూలిపోతాయి అని తొలి ప్రధాని నెహ్రూ ఎప్పుడో హెచ్చరించారు. కానీ, ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో జరుగుతున్నదేమిటి..?? విపక్షాలను కలుపుకుని పోవాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. పార్లమెంటు చరిత్రలోనే ఒకే సెషన్‌లో146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి మోడీ సర్కార్‌ ‘మహాభారతం’లో ఒక చీకటి పర్వాన్ని లిఖించింది. నూతన పార్లమెంటు భవనం గాండ్రించే సింహతలాటం, రాజదండాలతో నిరంకుశరాచరికానికి ప్రతిబింబమన్న విమర్శలను నిజం చేస్తూ నిరంకుశ చర్యలతో ప్రజాస్వామ్య విలువలకు కాషాయ పార్టీ సమాధి కట్టేసింది. పార్లమెంట్‌ భద్రత పై హోంమంత్రి ప్రకటన కోరిన పాపానికి ప్రతిపక్ష సభ్యుల్లో 70 శాతం మందిని బయటకు నెట్టి అత్యంత కీలకమైన మూడు క్రిమినల్‌ బిల్లులను ఎలాంటి చర్చలేకుండానే ఉభయ సభల్లో మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నారు. తృణమూల్‌ ఎంపి మహువా మొయిత్రా పై అనర్హత వేటుతో మొదలైన బీజేపీ అప్రజాస్వామిక ఎత్తుగడలు శీతాకాల సమావేశాల చివరి రోజు వరకు కొనసాగాయి. బ్రిటిష్‌ చట్టాలు కాస్తా ఫాసిస్టు చట్టాలుగా రూపాంతరం చెందాయి. ఆంగ్ల పేర్లతో వున్న చట్లాలకు హిందీ పేర్లు పెట్టి కొత్తసీసాలో పాతసారా పోసి, మరింత కుళ్లబెట్టినట్టు బ్రిటీష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)ని భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)గా, నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ) భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎన్‌)గా, సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో భారతీయ సాక్ష్య (బీఎస్‌) బిల్లులను చట్టాలుగా మార్చుకునేందుకు ‘లోక్‌సభ’ మెడలు వంచి మరి ఆమోదింపజేసుకుంది. ఇవన్నీ భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే బిల్లులే అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
పేర్లను రాజభాషలోకి మార్చినంతమాత్రాన రాళ్లు రాళ్లే అవుతాయి తప్ప రత్నాలు కావు కదా. ప్రతిపాదిత కొత్త చట్టాల్లో లొసుగులు అన్నీ ఇన్నీ కావని, ఇప్పటికే ఎందరో న్యాయనిపుణులు ఎండగడుతున్నారు. స్వతంత్ర, ప్రజాస్వామ్య దేశంలో అసలు అవసరమే లేదనుకుంటున్న 124 (ఏ) సెక్షన్‌ రాజద్రోహాన్ని తొలగించి, 121 సెక్షన్‌తో దేశద్రోహ చట్టంగా మార్చింది. హక్కుల కోసం రోడ్డెక్కితే నేరమట, అభాగ్యులను పోలీసురాజ్యం లాఠీలు, బాష్పవాయువులతో కబళిస్తే అది దేశరక్షణ. ఇది అరాచకమంటే అది దేశద్రోహం. భారతదేశ ప్రతిష్టను దిగజార్చేలా ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితి ఉండదని చెపుతున్న హోంమంత్రి దేశ ప్రతిష్టకు, ప్రభుత్వ ప్రతిష్టకు మధ్య అంతరాన్ని చెప్పలేకపోయారు. దేశం, జెండా, భద్రత, ఆస్తులతో ఎవరు చెలగాటమాడినా జైలు కెళ్లాల్సిందేనని కూడా చెప్పుకొచ్చారు. అసలు గడిచిన తొమ్మిదిన్నరేండ్లుగా వాటికి వ్యతిరేకంగా మాట్లాడింది ఎవరు.?? అసలు ఈ చట్టాలలో ‘ఉగ్రవాదం’ అనే పదానికి ఇచ్చిన నిర్వచనం ఎవరికి చెందుతుంది..?? పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని, గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులనూ, కనీసవేతనాల్లేక కాలే కడువులతోనున్న అసంఘటిత కార్మికులనూ, ఉపాధి హామీకి దిక్కేలేని వ్యవసాయకూలీలనూ, దేశ జనాభాలో 18 శాతమున్న ముస్లిములు, ఇతర మైనారిటీలను, వీరందరి బాధలనూ తమ బాధలుగా మలచుకొని కలం పట్టి, గళంవిప్పే పాత్రికేయులనూ ఉగ్రవాదులుగా పరిగణిస్తారా..?? గత దశాబ్దకాలంగా ఫాసిస్టు విధానాలతో మానవహక్కులను కాలరాస్తున్నదెవరు..?? లోక్‌సభలో గుండెలు బాదుకున్న అమిత్‌షా వాదనలో ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. ఎంతో ప్రమాదకరమైన ఈ బిల్లులను ‘చరిత్రాత్మకం’ అని భావించినప్పుడు సమగ్రమైన చర్చ లేకుండా, ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసి మరీ చట్టాలుగా మార్చుకోవడం వెనుక పరమోద్దేశం ఏమిటో అర్థం చేసుకోలునంత అమాయకులు కాదు ఈ దేశ ప్రజలు.
ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలోనే ప్రతిపక్షాల సభ్యులు నిరసన తెలియజేస్తే దానికి కూడా వక్రభాష్యాలు అల్లేసి, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కడ్‌కు అన్యాయం జరిగి పోయిందహో అంటూ పార్లమెంటులో బీజేపీ నేతలు చేసిన చేష్టలు విరక్తి పుట్టించాయి. ప్రతిపక్ష మంటే ప్రజల గొంతుక, ప్రజల సమస్యలను ప్రస్తావించేలా చట్టసభల అధిపతులు ప్రతిపక్షాల హక్కులను కాపాడి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ పార్లమెంటు ఉభయసభల అధిపతులూ ఈ బాధ్యతను నిర్వహించకపోవడమేగాకుండా ప్రభుత్వానికి వంతపాడి సభాసాంప్రదాయాలను సైతం మంటగల్పారన్న విమర్శలకు శీతాకాల సమావేశాలే తార్కాణం. ఈ నిరంకుశ చర్యల పట్ల ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదం అన్నది మా వాదన.