తుంగతుర్తి, సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి): ఉపాధ్యాయ సమస్యలపై టీఎస్ యుటిఎఫ్ ఎనలేని కృషి చేస్తోందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సిరికొండ అనిల్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరిధిలోని పలు పాఠశాలలను సందర్శించి సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యుటిఎఫ్ కీలకపాత్ర పోషించిందన్నారు. అన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని వెంటనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోతే కొత్తగా చేరిన విద్యార్థులు తిరిగి ప్రైవేటు పాఠశాలకు వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.పెండింగ్ లో ఉన్న కరువు భత్యాన్ని(డిఏ) వెంటనే విడుదల చేయాలని,పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను దసరా సెలవుల్లో పూర్తి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెలుగు రమేష్,ఎం గురువయ్య, మల్లెపాక రవీందర్ సోమయ్య తో పాటు వివిధ పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- 1 view