వెయ్యిస్తంభాల గుడికి యునెస్కో గుర్తింపుకు కృషి చేస్తా

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:12
UNESCO will work for the recognition of the thousand-pillared temple
  • రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్

హనుమకొండ‌, సెప్టెంబర్10 (ప్రజాజ్యోతి) కాకతీయుల కళావైభవానికి ప్రతీక అయిన వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధికి కోటి రూపాయాలను కేటాయించారు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్. శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వరంగల్ వచ్చిన ఆయన భద్రకాళీ అమ్మవారిని, రుద్రేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెయ్యిస్తంభాల గుడిని పరిశీలించిన ఆయన అద్భుతమైన కళాకృతులు, శిల్పసంపద కేంద్ర పురావస్తుశాఖ నిర్లక్ష్యానికి గురికావడం, యేండ్లకు యేండ్లు గడుస్తున్న కళ్యాణమండప నిర్మాణం ఎక్కడ వేసిన గంగొళి అక్కడేనన్న చందంగా ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు.

మన చరిత్రను, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలని ఆయన అన్నారు. ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న వెయ్యిస్తంభాల గుడి అభివృద్ధి మనందరి బాధ్యతగా భావించి  ఆలయ అభివృద్ధికి, ఇతర సౌకర్యాల కల్పన నిమిత్తం కోటి రూపాయలను తన ఎంపి ల్యాడ్స్ నుంచి అందించనున్నట్టు తెలిపారు. ప్రతీ సంవత్సరం కోటి రూపాయలను కేటాయించి ఆలయమ పునర్వైభవానికి తనవంతు సహాకారం అందిస్తానని చెప్పారు. జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి భద్రకాళీ అమ్మవారి ఆలయంలో, వెయ్యి స్తంభాల ఆలయ పరిసరాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అనంతరం గోశాలలో గోవులకు ఆహారం తినిపించారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరాలైన హన్మకొండ, వరంగల్ ట్విన్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని, వరంగల్ నగరం మునుపెన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి సాధిస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ అంటే కేసిఆర్ కు ఎనలేని అభిమానమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయితీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ ఈస్ట్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యే అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ కుడా ఛైర్మన్ సుందర్ రాజు తో పాటు వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్లు పాల్గొన్నారు.