జాతీయ విద్యా విధానంపై స్పష్టమైన చర్చ జరగాలి

Submitted by Ashok Kumar on Tue, 06/09/2022 - 17:30
There should be a clear discussion on the national education policy

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 06 :     మంగళవారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యు ఎస్ ఎఫ్ ఐ) జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 19, 20, 21 తేదీలలో హనుమకొండ పట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయి సదస్సులను జయప్రదం చేయాలని కోరుతూ ఎం ఏ ఎల్ డి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డి.శ్రీపతి నాయుడు చేతుల మీదుగా జాతీయ సదస్సు బ్రోచర్ ను విడుదల చేయడం జరిగింది.అనంతరం డి.శ్రీపతి నాయుడు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి) పాలసీ పై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. జాతీయ విద్యా విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 42వ రాజ్యాంగ సవరణ లో విద్య కేంద్రం మరియు రాష్ట్రాల పరిధిలో ఉండేదని కానీ బిజెపి జాతీయ విద్యా విధానం పేరుతో హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. అలాగే దేశవ్యాప్తంగా విద్యా కాషాయకరణ చేయాలని తప్పుడు విధానం అవలంబిస్తుందని తెలిపారు.  యూనివర్సిటీల స్వయంప్రతిపత్తికి ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడంతోపాటు విద్యాహక్కు చట్టాన్ని నీరు గారిచే కుట్ర చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలలో అందరికీ సమాన విద్యా అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం పేద వర్గాలు తీసుకునే ఫెలోషిప్ ను రద్దు చేయడం బాధాకరమన్నారు.

విద్యను దూరం చేస్తూ పైకి మాత్రం నీతులు వళ్లించడం బిజెపికే చెందుతుందని ఎద్దేవా చేశారు. జాతీయ విద్యా విధానం వల్ల విద్య మరింత అంగడి సరుకుగా మారుతుందని కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారం చేసుకోవడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. విదేశీ యూనివర్సిటీలను ఆహ్వానించి, దేశీ యూనివర్సిటీ మూసివేయాలని కుట్రలు తిప్పి కొట్టాలని, మేధావులు విద్యార్థులు గమనించాలని అన్నారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలను ఆర్ఎస్ఎస్ కేంద్రాలుగా మార్చే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇలాంటి విధానాలతో దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని తెలిపారు. బిజెపి యొక్క అనైతిక విలువలను దేశ ప్రజానీకం గమనించాలని పిలుపునిచ్చారు.
ఈ జాతీయ సదస్సుకు అన్ని వర్గాల  వారు హాజరై జయప్రదం చేయాలని కోరారు. అనంతరం యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర  సహాయకార్యదర్శి వామన్ పల్లి రంగస్వామి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిజెపి తీసుకొస్తున్న విధానాలపై మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు సామాజికవేత్తలు విద్యార్థి ప్రతినిధులు హాజరవుతున్నారని దీని జయప్రదం కోసం అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు.  ఈ ఆవిష్కరణలో యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులుబైదొడ్డి నరేష్,తిమప్ప,రవి, రాకేష్, రాము లతోపాటు తదితరులు పాల్గొన్నారు.