స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్,13 (ప్రజాజ్యోతి ) :- స్టేషన్ ఘన్పూర్ లోని సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పస్తం పృథ్వి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు మంగళవారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు వెళితే విద్యార్థి సంఘం నాయకులకు ప్రవేశం లేదంటూ పాఠశాల అధ్యాపకులు నిలువరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
విద్యార్థి సంఘాలను అనుమతించకుండా పాఠశాల లోపల విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. విసిటింగ్ హౌర్స్ లో తల్లితండ్రులను సైతం విద్యార్థులను కలిసేందుకు అనుమతించట్లేదని పిల్లల బాగోగులు తెలుసుకొనే బాధ్యత తల్లితండ్రులకు లేదా అని ఆయన ప్రశ్నించారు. కొంతమంది విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు తమ దగ్గరికి వస్తే టీచర్లు వారిని భయభ్రాంతులకు గురిచేసి వారి సమస్యలు బయటికి చెప్పకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. అనంతరం గేట్ బయట ధర్నా నిర్వహించారు.