కిడ్నాప్ అయిన బాలుడి హత్య

Submitted by bosusambashivaraju on Wed, 21/09/2022 - 13:25
 Murder of Kidnapped Boy

సమీప బంధువే నిందితుడు 

కొడకండ్ల (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 20 :   ఆదివారం మండల కేంద్రంలో జమీల్ ,జలీనా దంపతుల కుమారుడు (ఐదు సంవత్సరాల బాలుడు) సాబీర్ కిడ్నాప్ కు గురవగా, హత్యకు గురై ఊరికి సమీపంలోని బావిలో వేయబడినట్టు పోలీసులు మంగళవారం కనుగొన్నారు. పోలీసులు గత రెండు రోజులుగా వివిధ బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టి, సీసీ ఫుటేజీ ఆధారంగా బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి సమీప బంధువు గుంశ మహమ్మద్ గా గుర్తించారు. తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు గుంశ మహమ్మద్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా  నిందితుడు గుంశా మహమ్మద్ మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలోని ఒక టీ దుకాణంలో ఉండగా మృతుని బంధువులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో , కుటుంబ సభ్యులు హోటల్ సమీపానికి చేరుకొని నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడిని వెంబడించిన బంధువులు నాగారం మండలంలోని పనిగిరి గ్రామంలో గొర్రెల కాపరుల సహాయంతో పట్టుకున్నారు. వెంటనే కొడకండ్ల పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై కొమురెల్లి సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టగా, బాలుడిని ఆదివారమే చంపి కొడకండ్లకు సమీపంలోని వ్యవసాయ బావిలో పడేసినట్టు పోలీసులకు తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని గుర్తించి సాయంత్రం శవాన్ని బయటకు తీసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘటనతో కొడకండ్ల మండలంలో విషాదఛాయలు నెలకొన్నాయి.