అత్యాశతో నకిలీ నోట్ల తయారీ ముఠాతో చేతులు కలిపిన యువకుడు
4లక్షలు ఇస్తే 20లక్షల ఆఫర్
బోనకల్, సెప్టెంబరు 21, ప్రజాజ్యోతి:
అతి తక్కువ కాలంలో అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఆశపడిన యువకుడు ఒక ముఠాతో చేతులు కలిపిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.స్థానిక మండల నడిబొడ్డులో దొంగ నోట్ల వ్యవహారం సంచలనం రేపింది వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని గిరిజన కాలనీకి చెందిన కొంతమంది యువకులు అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో గత కొంతకాలం క్రితం నాలుగు లక్షల రూపాయల అసలు నోట్లకు బదులు ఇరవై లక్షల రూపాయల దొంగ నోట్లు ఇస్తామని ఒప్పందం కుదురుచుకొని ఇవ్వకపోవడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించడం జరిగినది. మోసపోయిన యువకుడికి సదరు ముఠా వ్యక్తులు దొంగ నోట్లు తయారు చేసే ఒక మిషను రెండు లిక్విడ్ బాటిల్ తో ఒక నకిలీ 500 రూపాయల నోటిని ప్రాక్టికల్ గా తయారుచేసి చూపించడంతో ఆ యువకుడు సదరు ముఠాకు డబ్బులు ఇవ్వటం జరిగినది. ఆ ముఠాకు ఇచ్చిన 4 లక్షల రూపాయలు ఈ యువకుడితోపాటు మరి కొంతమంది స్నేహితులు కలిసి ఇచ్చినట్టు సమాచారం.రెండు రోజుల్లో ఇస్తానని డబ్బులు సంవత్సరం అయినా ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది....మండలంలో దొంగ నోట్ల ముఠా వ్యవహారం బయటపడటంతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒప్పందం ప్రకారం ఆ 20 లక్షలు ఆ యువకుడి చేతిలోకి వచ్చి ఉంటే ఆ నకిలీ నోట్లన్నీ మండలంలోని చలామణి అయ్యేవని మండల ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పోలీసులు ఉక్కు పాదం మోపాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.