పాలకీడు, సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి) : పాలకీడు మండలంలోని నాగార్జునసాగర్ పదవ నెంబర్ కెనాల్ చివరి ఆయకట్టు భూములు నిలువునా ఎండిపోతున్నాయి. సాగర్ ప్రధాన ఎడమ కాలువకు గండి పడిన చోట మరమ్మతులు సుదీర్ఘకాలం చేయడంతో వరి పొలాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. కంటి ముందు పచ్చటి పొలాలు ఎండిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు 24 గంటల ఉచిత విద్యుత్ అటకెక్కింది. అంతో ఇంతో నీటి ఆధారం ఉన్న రైతులు బోరు బావులను నడుపుకోవడానికి కరెంటు కోతలు శాపంగా మారాయి. సాగర్ నీటికీ అంతరాయం ఏర్పడడంతో విద్యుత్ అధికారులు రోజుకు 17 గంటలు త్రీఫేస్ కరెంటును సరఫరా చేస్తున్నామని చెప్తున్నా ఆచరణలో అమలవడం లేదు. గత రెండు రోజులుగా పాలకీడు సబ్స్టేషన్లో ప్రధాన ట్రాన్స్ఫారం నడవడం లేదు. దీంతో రైతులకు కరెంటు కష్టాలు తప్పట్లేదు. త్వరగా విద్యుత్ ట్రాన్స్ఫారం రిపేరు చేయించి సాగర్ నీరు అందే వరకు 24 గంటల విద్యుత్తును అందించి కొంతవరకైనా ఎండుతున్న పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
- 4 views