కాజీపేట, సెప్టెంబర్ 07 (ప్రజాజ్యోతి) కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వహకులతో బుధవారం సిఐ మహేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసిన సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులకు ఊరేగింపు సమయంలో డిజేలు పెట్టకూడదని, ఒకవేళ డిజేలు పెట్టినచో సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం తగిన చర్య తీసుకొనబడునని కాజీపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి నిర్వాహకులకు తెలిపారు. గణేష్ ల అలంకరణ ఎత్తుగా చేయడం వల్ల విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉందని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, తొందరగా పూజలు నిర్వహించి నిమజ్జనం 9వ తేదీన రోజున బంధం చెరువు వద్ద నిమజ్జనం చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
భక్తులందరూ బంధం చెరువు వద్ద వారి వినాయకులను నిమజ్జనం చేసుకోవాలని కోరారు. గణేష్ ఊరేగింపు సమయంలో పోలీసులకు సహకరించి, వారు సూచించిన రూట్లో వెళ్లవలసిందిగా ముందు వాహనాలను అనవసరంగా ఓవర్ టేక్ చేయరాదని, గొడవలు పెట్టుకోరాదని తెలియచేశారు. అదేవిధంగా ఏదైనా గొడవలకు పాల్పడినచో వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకొనబడును అని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులు, ఎస్సై సతీష్, పోలిస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.