మంత్రి అజయ్ పై అసత్య ప్రచారం తగదు
కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంతలక్ష్మి
ఖమ్మం ప్రతినిధి, సెప్టెంబర్ 11 ప్రజాజ్యోతి . ప్రతిపక్ష పార్టీల అండతో తీన్మార్ మల్లన్న ప్రజలను తప్పుదోవ పట్టిస్తు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఖమ్మం నగర 20వ డివిజన్ కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంతలక్ష్మి మండిపడ్డారు. ఇకపై అలాంటి వాటిని ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. గురివింద గింజ తన కింద ఉన్న నలుపును ఎరుగదన్నట్టు ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. అక్రమాలకే కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తీన్మార్ మల్లన్న అక్రమాలు గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.తీన్మార్ మల్లన్న ముందు తాను పునీతుడై ఇతరుల గురించి మాట్లాడితే మంచిదని ఆధారాలు చూపకుండా అక్రమాలు జరిగాయని మంత్రిని దోషిగా చేయడం ధృతరాష్ట్రుడు అంధుడై తన కొడుకుల అపారమైన తప్పులను గమనించకుండా పాండవులను తప్పుబట్టడం లాంటిదే అని ఎద్దేవా చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమర్థవంతమైన నాయకత్వంలో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న ఖమ్మంను ఆగం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక నిరాధార ఆరోపణలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని ప్రశాంతలక్ష్మి ఆరోపించారు.