కొడకండ్ల మహాదేవాలయంలో ఆవిష్కృతమైన అపురూప ఘట్టం
పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 08 : మండల కేంద్రంలోని 700 సంవత్సరాల చరిత్ర గల అతి పురాతనమైన మహాదేవాలయంలోని శివలింగంపై ప్రతి సంవత్సరం లాగే ఈ కార్తీకమాసంలో కూడా కార్తీక పౌర్ణమి మంగళవారం రోజున శివలింగానికి తన కిరణాలతో సూర్యుడు అభిషేకించే అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రతి సంవత్సరం దక్షిణాయనంలో కార్తీకమాసం మొదటి పక్షం సూర్యకిరణాలు ప్రసరించడమే కాకుండా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే పుష్య మాసం మొదటి పక్షం సంక్రాంతి సమయంలో సూర్యుడు ఉదయించే సమయంలో తొలి సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని తాకుతాయని, ధ్వజస్తంభం అడ్డుగా ఉన్న ఎలాంటి నీడ పడకుండా నేరుగా సూర్యకిరణాలు పడటం ఈ ఆలయ ప్రత్యేకత అని అర్చక స్వామి పిండిపోలు నాగ దక్షిణామూర్తి తెలియజేశారు. మంగళవారం ఉదయం శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరిస్తున్న సమయంలో శివలింగానికి మహాన్యాస పూర్వక పంచామృత అభిషేకాలు, సహస్ర నామార్చన నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.