- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
మహబూబ్నగర్, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి ప్రతినిధి) : సెప్టెంబర్16 నుండి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు . వజ్రోత్సవాల నిర్వహనపై బుధవారం అయన హైదరాబాద్ నుండి రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ,జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలపై మంగళవారం ప్రభుత్వం స్పష్టంగా రెండు జీవోలు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 16వ తేదీన జిల్లా కేంద్రంతో పాటు, ఆయా నియోజకవర్గ కేంద్రాలలో 15000 మందికి తగ్గకుండా ర్యాలీలు నిర్వహించాలని ,
ర్యాలీలో పాల్గొన్న వారందరికీ అవసరమైన భోజనంతో పాటు, అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. భోజనం సందర్భంగా ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు . ఈ నెల 17వ తేదీన ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు గ్రామపంచాయతీలో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించాలని చెప్పారు. 18 వ తేదీన జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ ఆదేశించారు . 17వ తేదీన ఉదయమే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు గిరిజన ప్రతినిధులను పంపించేందుకు తగిన ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్బంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు.రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా 16 న ర్యాలీ, 17వ తేదీన అవసరమైన పోలీస్ బందోబస్తు ,ఇతర ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు .పోలీస్ అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకోసం చేస్తున్న ఏర్పాటులను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన అన్ని ఏర్పాటు చేశామని 16వ తేదీన మహబూబ్నగర్ తో పాటు దేవరకద్ర, జడ్చర్లలో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని అందుకు ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు.
17వ తేదీన జాతీయ పతాకావిష్కరణ తో పాటు ,హైదరాబాద్ కు ప్రతినిధలను పంపెందుకు బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు .జిల్లా నుండి 4358 మందిని హైదరాబాద్ పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. 18 న నిర్వహించే సంస్కృతిక కార్యక్రమాలకు కూడా అవసరమైన ఏర్పాటు చేశామని వెల్లడించారు . జిల్లా ఎస్పీ ఆర్ .వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ర్యాలీ, 17వ తేదీన ప్రతినిధులను హైదరాబాద్ కు పంపించే విషయంతో పాటు, 18 తేదీన నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తామని వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.వీడియో కాన్ఫెరెన్సు అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామరావుతోపాటు, జిల్లా అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హాజరయ్యారు.