" మహబూబ్ నగర్ జిల్లా విద్యావ్యవస్థలో అనేకమార్పులు వచ్చాయి"
--- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 23 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాపరంగా అనేక మార్పులు వచ్చాయని,రాష్ట్రవ్యాప్తంగా వేయి గురుకులాలు పెడితే మహబూబ్ నగర్ లొనే 20 ఉన్నాయని ,20 రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు ,293 కోట్ల రూపాయలతో పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టినట్లు రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు , సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.శుక్రవారం అయన మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ గ్రామీణ మండలం, కోట కదిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర సహకారంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగావిని, కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు.అక్షయపాత్ర ద్వారా శుక్రవారం నుండి 4947 మంది విద్యార్థులకు 47 పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పది తర్వాత చదివే అంశాలపై అవగాహన కల్పించాలని, డిగ్రీ వరకు పర్యవేక్షిస్తే వారు ఏదో ఒక రంగంలో నిలదొక్కుకుంటారని ఆన్నారు మహబూబ్ నగర్ జిల్లా ఊహించిన విధంగా అభివృద్ధి సాదించిందని, గతంలో తాగడానికి కూడా మంచినీరు ఉండేది కాదని, ఇప్పుడు ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామని, 24 గంటల విద్యుత్తు, పెన్షన్లు, రైతుబంధు ,రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లానుండి వలసలు వెళ్లే పరిస్థితి నుండి వలసలు వాపస్ వస్తున్నారని అన్నారు. మన్నెంకొండ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, ముఖ్యంగా పెద్ద ఆర్చి తో పాటు, షాప్స్ ఏర్పాటు చేసి షాపులను హోటళ్ల,ఇతర వ్యాపారాలు చేసుకొనే ఏర్పాటు చేశామని, ఒకేసారి 100 మంది వివాహాలు చేసుకునే విధంగా పెద్ద షెడ్డు నిర్మాణం చేయించామని, అదేవిధంగా ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణంలో ఉందని ,15 కోట్ల రూపాయలతో టూరిజం హోటల్ ను త్వరలోనే చేపట్టబోతున్నామని, కొండపైన 18 రూములతో వసతి కల్పిస్తున్నామని, కోనేటిని కృష్ణ నీటితో నింపామని తెలిపారు.
జిల్లాలో అన్ని శాఖలు ఒకే దగ్గర వచ్చేలా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన సముదాయం త్వరలోనే ప్రారంభం కానుందని, పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని, కరివేన, ఉదండపూర్ రిజర్వాయర్లను పూర్తిచేస్తే జిల్లా సస్యశ్యామలమవుతుందని, అలాగే డబుల్ రైల్వే లైన్ త్వరలో పూర్తికానుందని, పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి తెలిపారు.ఈ సందర్బంగా మంత్రి విద్యార్థులకు గోరు ముద్దలు తినిపించారు. మహబూబ్నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, రైతుబంధు మండల డైరెక్టర్ మల్లు నరసింహారెడ్డి , డిఇఓ రవీందర్ , గ్రామ సర్పంచ్ రమ్య, అక్షయపాత్ర ప్రతినిధి కృష్ణ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- 4 views