భక్తులకు అన్నదానం
దుర్గమ్మను దర్శించుకున్న మండలి చైర్మన్
చిట్యాల అక్టోబర్ 02(ప్రజాజ్యోతి)./...చిట్యాల పట్టణంలోని కనకదుర్గ దేవాలయంలో అమ్మవారు దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెరుగు అన్నం ను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుండే అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ బాల బాలికలచే సరస్వతి పూజ చేయించి అక్షరాలు దిద్దించారు. కుంకుమార్చన లో మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి అలంకరణకు పగిడిరాజ గోవర్థన్ రెడ్డి జ్యోతి, పోలా యాదగిరి లక్ష్మమ్మ దంపతులు దాతలుగా సహకరించారు. ఉత్సవాలు మరింత వైభవంగా జరిగేందుకు భక్తులు అమ్మవారికి విరాళాలు అందించాలని ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ శీలా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సీఐ శివరాం రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, సాయి రెడ్డి ప్రతాపరెడ్డి, జిట్టా శేఖర్, వరకాంతం నర్సిరెడ్డి, భక్తులు అమ్మవారి సేవకులు పాల్గొన్నారు.
భక్తులకు అన్నప్రసాద వితరణ
ఉత్సవాలలో భాగంగా ఆదివారం కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.గోదుమగడ్డ రాంరెడ్డి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
అమ్మవారిని దర్శించుకున్న మండలి చైర్మన్ గుత్తా
చిట్యాల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి దేవస్థానం లో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు.ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభం తో ఆయనకు ఘన స్వాగతం పలికారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శాలువా, పూలమాలతో సత్కరించి అర్చకులు ఆశీర్వచనం అందించారు. పట్టణానికి చెందిన పోలా యాదగిరి ఆర్ధిక సహకారంతో సమకూర్చిన పలకలు, పుస్తకాలు, పెన్నులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిన్నారులకు పంపిణీ చేశారు. ఆయన వెంట ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తేరటుపల్లి హనుమంతు, తెరాస పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి జిట్ట చంద్రకాంత్ తదితరులు ఉన్నారు.
- 6 views