వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 22( ప్రజా జ్యోతి);//// ఆదివాసీ నవనిర్మాణ సేన గత కొన్ని రోజుల నుండి చేస్తున్న దీక్ష గురువారం 31 వ రోజుకి చేరుకున్నాయి. వలస గిరిజనేతరుల అనుమతులు లేని అక్రమ నిర్మాణాల పైన ఎల్టీఆర్ కేసులు పెట్టాలని, వలస గిరిజనేతరులను ఏజెన్సీ నుండి పంపించాలి అనే ప్రధాన డిమాండ్లతో నర్సింహమూర్తి దీక్ష చేపట్టాడు. ఈ దీక్షకి వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజలు 30 రోజుల పాటు వెన్నుదన్నుగా నిలిశారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ఆదివాసీ సంఘాలు భారీగా మద్దతు కూడా తెలపడం. వలస నిరోధక చట్టాన్ని అమలు చేయాలని ఇంత బలంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం ఇదే ప్రధమం. 1917, 1959, 1963, 1970 వలస బ్రిటిష్ పాలకుల తో పాటు ,భారత ప్రభుత్వాలు ఏజెన్సీ వలస నిరోధక చట్టాలు తేవడం జరిగిందని, కానీ వాటి అమలు మాత్రం మర్చిపోయారు. దీనితో మైదాన ప్రాంతాల నుండి గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాల్లోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరారు. రావడంతో పాటు భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడం చేస్తున్నారు. ఇంతటితో వీరి ఆగడాలు ఆగలేదు, వ్యాపారులు ,వ్యవసాయాలు చేయడం, చివరికి రాజ్యాంగ పదవులను కూడా చేజిక్కించు కోవడం మొదలు పెట్టారు. దీనితో ఆదివాసీల హక్కులు ,చట్టాలు అమలుకు నోచుకోక పోవడంతో పాటు ఆదివాసీల బ్రతుకులు దుర్భరంగా మారిపోతున్నాయి. చట్టాలు అమలు చేయాలని 30 రోజుల నుండి సర్పంచ్ దీక్షలు చేపట్టడంతో అధికార యంత్రాంగం ఎట్టకేలకు దిగి వచ్చింది. గురువారం తాహశీల్దార్ అంటి నాగరాజు, ఎంపిడిఓ బాబు, ఎంపిఓ రహీమ్ దీక్షా శిభిరం వద్ద కి వచ్చి వలస గిరిజనేతరుల అక్రమ నిర్మాణాల పైన ఎల్టీఆర్ చేసి సదరు వివరాలు సర్పంచ్ నర్సింహమూర్తి కి అందజేశారు. తహసీల్దార్ ఎన్.ఓ.సి లేకుండా పంచాయతీ వారు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని పంచాయతి అధికారుల కు సూచించారు. 1/70 చట్టాన్ని వంద శాతం అమలు చేస్తానని తెలిపారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించిన ఉపేక్షించేది లేదన్నారు . మండల పంచాయతీ అధికారి రహీముద్దీన్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా నిర్మాణ దశలో ఉన్న అక్రమ నిర్మాణాలను తక్షణమే సీజ్ చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు అని తెలిపారు. ఇక నుండి గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకుండా ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేస్తామని, అలాగే వలస గిరిజనేతరులకు జారీ చేసిన ఇంటి నంబర్లు , వ్యాపార అనుమతులు కూడా వారం రోజుల్లో గ్రామసభ నిర్వహించి రద్దు చేయనున్నట్లు నిరసన కారులకు హామీ ఇచ్చారు. ఎల్టీఆర్ కేసులు చేసిన వారి వివరాలను భద్రాచలం, ఏటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారులకు, ఎస్ డి సి కి అందజేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. అనంతరం తహశీల్దార్ అంటి నాగరాజు సర్పంచ్ నర్సింహమూర్తి కి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు.
యుద్ధం మిగిలే ఉంది
సర్పంచ్ మాట్లాడుతూ ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ఆదివాసీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఇది ఆదివాసీల విజయం అన్నారు. ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఆదివాసీల హక్కులు, చట్టాల అమలు కోసం యుద్ధం మిగిలే ఉందన్నారు. వలస గిరిజనేతరులు ఏజెన్సీ నుండి వెళ్లి పోయే వరకు ఇదే ఉద్యమాన్ని కొనసాగిస్తాని అన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా వలస వాదులను వెల్లగొట్టిన కేసీఆర్ ఏజెన్సీ లో ఆంద్ర వలస వాదులను ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. ఏజెన్సీ నుండి ఆంధ్ర వలస వాదులను పంపించే అంతవరకు నా ఉద్యమం ఆగదని అన్నారు. ఆదివాసీ చట్టాల అమలుతోనే ఆదివాసీల అస్తత్వం ఉంటుందన్నారు. ఆదివాసీ రాష్ట్ర సాధన కొరకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఆదివాసీ సంఘాలను కోరారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు,భార్గవ్, విజయ్, సుభద్ర, కారం రాధ, మహేష్ వాసం నారాయణ, బాబు, మధు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
- 1 view