బాలల సమస్యలు పరిష్కరించుటకే బాల అదాలత్ ఎస్సీపీసీఆర్ సభ్యులు యెడ్లపల్లి బృందాధర్ రావు

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:45
 Bal Adalat is for solving the problems of childrenMembers of SCPR Yedlapalli Brindadhar Rao

హనుమకొండ, సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి).బాలల సమస్యలు పరిష్కరించుటకు బాల అదాలత్ నిర్వహిస్తున్నట్లు  తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎస్సీపిసీఆర్ సభ్యులు యెడ్లపల్లి బృందాధర్ రావు అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం సెప్టెంబర్ 21 బుధవారం రోజున నిర్వహించ తలపెట్టిన బాల అదాలత్  బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బెంచ్ ఏర్పాటు లో భాగంగా గురువారం రోజున సమీకృత జిల్లా జిల్లా కార్యాలయాల  సముదాయంలోని సమావేశ హాలులో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత అధ్యక్షతన నిర్వహించారు. సమన్వయ సమావేశానికి హాజరైన బృందాధర్ రావు మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేయనున్న బాల అదాలత్ లో ప్రధానంగా 18 సంవత్సరాలలోపు బాల బాలికల సమస్యలు పరిష్కరించే వేదికలో అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాలని, ఒక రోజంతా పిల్లల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని, తద్వారా బాలల సమస్యలు పరిష్కరించుటలో హనుమకొండ జిల్లా రాష్ట్రానికి దేశానికి మోడల్ గా నిలవాలని ఆకాంక్షించారు. బాల అదాలత్ బెంచ్ విజయవంతం కావడానికి సమగ్ర శిశు అభివృద్ధి అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు, ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ సహకారంతో దండోరా వేయించాలని, గ్రామ సర్పంచ్ లు కార్యదర్శుల సహకారంతో  సంబంధిత సమాచారం తెలిసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి, బెంచ్ ఏర్పాటు రోజున ఒక సబ్ డివిజనల్ పోలీస్ అధికారి స్థాయి ర్యాంకు అధికారితో పాటు సంబంధిత పోలీసులు ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు, సమస్యలు లిఖిత పూర్వకంగా తెలియచేయుటకు సహకరించుటకుగాను ఉపాధ్యాయ బృందాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ  అధికారులకు సూచించారు. బాల అదాలత్ కార్యక్రమాన్ని మూడు విధాలుగా నిర్వహిస్తామని ఒకటి ప్రారంభ కార్యక్రమం గా రెండవది బాల అదాలత్ బెంచ్ గా మూడవది ముగింపు సమావేశం గా నిర్వహించి ఆర్జీ పెట్టుకున్న వారి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.


ఎస్సీపీసీఆర్ మరో సభ్యులు ఏ శోభారాణి మాట్లాడుతూ బాల అదాలత్ కు వచ్చే బాల బాలికలకు అర్జీదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బాల బాలికలు ఆకలికి ఇబ్బందులు పడకుండా  భోజన  సదుపాయం కల్పించాలని జిల్లా సంక్షేమశాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని, స్వచ్ఛంద సంస్థలు, బాలల సంరక్షణ కేంద్రాల పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు.అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి మాట్లాడుతూ జిల్లాలో తొలి సారిగా నిర్వహిస్తున్న బాల అదాలత్ బెంచ్ ను విజయవంతం చేయుటకు ప్రతి అధికారి అంకిత భావంతో పని చేయాలని, గోడ పత్రికలు, కర పత్రాల ద్వారా  సంబంధిత సమాచారం ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఈ
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత, జిల్లా పంచాయతీ అధికారి వి జగదీష్, డీటీడీవో ప్రేమకళ, ఎన్సిఎల్పి డైరెక్టర్ బుర్ర అశోక్, అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ టి మదన్ మోహన్ రావు, కార్మిక శాఖ అదనపు కమిషనర్ ప్రసాద్ రావు, సిడిపివో లు కే శిరీష , కే మధురిమ, భాగ్యలక్ష్మి స్వరూప, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పి సుధాకర్, ఎస్ రాజేంద్ర ప్రసాద్, కే దామోదర్, పి హైమావతి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం కరుణాకర్, జెండర్ ఎక్స్పర్ట్ కో ఆర్డినేటర్ జయ,
జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎస్ ప్రవీణ్ కుమార్, మౌనిక, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ లు ఎండీ  ఇక్బాల్ పాషా, రాగి కృష్ణ మూర్తి, సఖి అడ్మిన్ పి హైమావతి, మాధవి, శ్రీనివాసులు, సునీత చైతన్య, విజయ్, శివ ప్రసాద్, సునీల్, సీత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.