అద్భుత పర్యాటక సంపద మన సొంతం ఎం ఎల్ సి బండా ప్రకాష్

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 13:21
 We have amazing tourism wealth     MLC Banda Prakash

హనుమకొండ, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి)..//...తెలంగాణలో అందులోని మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుతమైన పర్యాటక సంపద వుంది. చారిత్రక కట్టడాలు సంప్రదాయాలు కలిగిన గొప్ప నెల ఇది అని ఎం ఎల్ సి బండా ప్రకాష్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ పర్యాటక దినోత్సవం నిర్వహించింది. మంగళవారం హరిత కాకతీయ లో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎం ఎల్ సి బండా ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. వరంగల్లో దేవుని గుట్ట వంటి చారిత్రక కట్టడాలు వాటి గురించి విద్యార్థులు తెలుసుకోవాలి అని అన్నారు. పర్యాటక రంగం పై సదస్సు లు సమావేశాలు ఇంకా ఎక్కువ జరగాలని సూచించారు. మన సంపద అందరికీ తెలియజేయాలి. పర్యాటకులకు నచ్చే ప్రదేశాలు చాలా వున్నాయి. కోవిడ్ తరువాత పర్యాటక రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడే మళ్ళీ పుంజుకుంటున్నది అని అన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ మాట్లాడుతూ జిల్లా పర్యాటక ప్రదేశాలు వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. హనుమకొండ కి చెందిన ప్రముఖ చిత్ర కారుడు రాజేశ్వర్ నన్నూట చిత్రాలను నాలుగు రోజుల పాటు ప్రదర్శనకు ఉంచామని అన్నారు. కాకతీయ యూనివర్సిటీ చరిత్ర,టూరిజం విభాగాధిపతి డాక్టర్ కే విజయబాబు మాట్లాడుతూ రాష్ట్రం, జిల్లాలో పర్యాటక అభివృద్ధికి, చరిత్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. పర్యాటక రంగం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్ష,పరోక్ష ఉపాధి లభిస్తుంది అని అందుకే దీన్ని స్మోక్ లెస్ ఇండస్ట్రీ అని అంటారు అని తెలిపారు.

ప్రముఖ చరిత్ర కారుడు అరవింద్ ఆర్య పకిడే మాట్లాడుతూ తెలంగాణ రాజహంస వంటిదని అన్నారు. ఎంతో పర్యాటక సంపద వున్న తెలంగాణ ను చూడటానికి దేశ విదేశీ పర్యాటకులు వస్తున్నారని అన్నారు. ఒక్క వరంగల్ లోనే 72 కు పైగా పర్యాటక ప్రదేశాలు వున్నాయని అన్నారు. అంతకు ముందు యోగ గురువు పోషాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం డ్రాయింగ్ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ఎం ఎల్ సి బండా ప్రకాష్ సర్టిఫికెట్లు అందజేశారు. హరిత కాకతీయ సిబ్బందికి సర్టిఫికెట్ లు అందజేశారు. ఈ సందర్భంగా  బండా ప్రకాష్ ను పర్యాటక శాఖ అధికారులు సన్మానించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త నిమ్మల శ్రీనివాస్ వ్యాఖ్యాత గా వ్యవహరించిన ఈ కార్యక్రమం లో ఎక్స్ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మ రావు, ఎన్ ఎస్ ఎస్ శ్రీనివాస్, పర్యాటక శాఖ సిబ్బంది లోకేష్, కొమరయ్య, చిరంజీవి, వంశీ మోహన్, ఖాదర్ పాషా, శరత్ తదితరులు పాల్గొన్నారు.