నిరంకుశ 'సర్కార్‌' చెరలో దేశం..!!

Submitted by Praneeth Kumar on Sun, 24/03/2024 - 15:43
Our nation is in the grip of tyrannical 'Sarkar'..!!

నిరంకుశ 'సర్కార్‌' చెరలో దేశం..!!

ఖమ్మం, ఫిబ్రవరి 24, ప్రజాజ్యోతి.

తన కంచుకోట వంటి ఢిల్లీలో చోటు లేకుండా చేయడమే గాక నెమ్మదిగా గుజరాత్‌, గోవాల లోనూ సవాలు చేశారనేది ఆప్‌ పై బిజెపికి ప్రత్యేక కక్ష. దేశమంతా తాము పాలిస్తుంటే ఆ పాలన జరిగే చోటును మరెవరో పాలించడం
మోది బృందం ఎన్నడూ భరించలేకపోయింది. బిజెపికి లోబడిపోతే భవిష్యత్తు ఉండదనే వాస్తవం ఆయన గ్రహించారు. అందుకే తమ పై దాడిని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు వివరించడానికి ఆయన దేశమంతా పర్యటించారు. ‘ఇండియా’తో సహా పలు ప్రతిపక్ష సమావేశాలకు హాజరైయ్యారు. కేంద్ర నిరంకుశత్వం పై పోరాటంలో పాలు పంచుకున్నారు. ఇవన్నీ సహజంగానే మోదికి మింగుడు పడలేదు. పైగా కేజ్రీవాల్‌ రాజకీయాలకు తన
భక్తిని జోడించి గుళ్లు కూడా తిరగడం మరింత ఆందోళన కలిగించి ఉంటుంది. ఈ పూర్వరంగంలో లిక్కర్‌ ఆరోపణలు మోది సర్కారుకు చక్కగా అచ్చివచ్చాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంతో నరేంద్ర మోది ప్రభుత్వ నిరంకుశత్వం పరాకాష్టకు చేరింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడైన అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు కోసం కేంద్రం పొంచి కూర్చున్న సంగతి అందరూ అనుకుంటున్నదే. లిక్కర్‌ స్కాం అనే దర్యాప్తులో వరుసగా అనేకమందిని అరెస్టు చేయడం ఒక ఎత్తైతే, ఎన్నికల ప్రకటన జరిగాక రాజ్యాంగ పదవిలో ఉన్న అది దేశ రాజధాని ప్రాంతాన్ని పాలిస్తున్న కీలక నేతను వెంటబడి నిర్బంధించడం మరో ఎత్తు. ఇది రాజ్యాంగ విలువలకే ప్రమాదం. ఇది కేవలం కేజ్రీవాల్‌కో లేక ఆప్‌కో సంబంధించిన అంశమనుకుంటే తప్పు చేసినట్టే. ఈ మధ్యనే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ కూడా ఇలాగే అరెస్టు చేశారు. ఇదే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ శిసోడియా ఇప్పటికిి ఏడాదిగా జైలులోనే ఉన్నారు. ఒకటికి రెండు సార్లు ఎన్నికైన ముఖ్యమంత్రులకు కూడా చట్టబద్దంగా పోరాడే అవకాశం ఇవ్వకుండా ఏవేవో ఆరోపణలతో సాంకేతిక సాకులతో ఖైదు చేయడం ఫెడరలిజం మీద దాడి తప్ప మరొకటి కాదు. సిబిఐ, ఇ.డి లను ఫెడరల్‌ ఏజన్సీలు (కేంద్ర సంస్థలు) అని సంబోధిస్తుంటారు. ఫెడరలిజం పై ఫెడరల్‌ సంస్థల దాడిలో తీవ్రమైన హెచ్చరిక దాగి ఉందని గమనించడం అవసరం. లిక్కర్‌ వ్యవహారంలో ఏం జరిగిందనేదానికి కేజ్రీవాల్‌ అరెస్టుకూ ఏ సంబంధం లేదు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపే. ఎందుకంటే ఆప్‌ అధినేతగా ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ దీనికి బాధ్యత వహించవలసి ఉంటుందని మాత్రమే తాజాగా సుప్రీం కోర్టుల్లో ఇ.డి అధికారులు చేస్తున్న వాదన కూడా. ఇందు కోసం వారు ఆప్‌ పార్టీని ఒక కంపెనీగా అభివర్ణించారు. మనీ లాండరింగ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 4లో కంపెనీది బాధ్యత అన్నారు గనక ఆప్‌ నాయకుడిగా కేజ్రీవాల్‌ శిక్షార్హుడనేది వారి ఏకైక వాదన. దీనికి తోడు అప్రూవర్లుగా మార్చుకున్న వారు ఇచ్చిన సాక్ష్యాలంటూ కొన్ని చూపిస్తున్నారు. వాటి లోతుపాతులు అటుంచి అరెస్టు చేయకుండా విచారించే అవకాశం లేదా అనే ప్రశ్న తప్పక వస్తుంది. తొమ్మిదిసార్లు సమన్లు ఇచ్చినా రాలేదనే ఫిర్యాదు దీనికి జత చేస్తున్నారు. అదే నిజమైతే రాకపోవడం పైనే ఫిర్యాదు చేసి ఉండాలి కదా. ఒకసారి వెళితే అరెస్టు అనివార్యమనే అంచనాతోనే ఆయన వెళ్లలేదనేది నిపుణుల అభిప్రాయం. చివరకు వచ్చేసరికి ఏకంగా అరెస్టు వారంటుతోనే ఇంటికి రావడం ఆయన సందేహాన్ని ధృవపరిచేదిగా ఉంది.

◆ చెప్పిందేంటి..?? చేసిందేంటి..??
ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్టు. తనకు వరుసగా సమన్ల పై సుప్రీం కోర్టులో విచారణ జరిగినప్పుడు అనవసరంగా వెంటాడుతున్నారని కేజ్రీ తరపు లాయర్లు వాదించారు. అరెస్టు చేసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు కూడా. అయితే అక్కడ ఇ.డి తరపున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ విఎస్‌ రాజు ఆ ఆరోపణను ఖండించారు. తాము కేవలం విచారించి తెలుసుకోవడానికి పిలుస్తున్నాము తప్ప అరెస్టు చేసే ఉద్దేశం లేదన్నారు. కానీ అదే రోజు సాయంత్రం సమన్లతో పాటు అరెస్టు వారంటు కూడా తీసుకుని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఇది ఒక విధంగా కోర్టు ధిక్కారమే. కేంద్ర సంస్థల కపట వర్తనకు ఇదో నిదర్శనం కూడా. అక్కడకు వెళ్లినప్పుడు వారి వ్యవహార సరళి, అంతులేని భద్రతా ఏర్పాట్లు, బిజెపి నేతల మూకుమ్మడి దాడి చూసిన తర్వాత అన్నీ అరెస్టు కోసమేనని దేశమంతటికి తెలిసిపోయింది, అదే జరిగింది. దాని పై ముఖ్యమంత్రి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది గాని ఉపశమనం ఇవ్వలేదు. తర్వాత హైకోర్టు ఆయనను వారం రోజులు ఇ.డి రిమాండ్‌కు అనుమతినిచ్చింది. బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత విషయంలోనూ పది రోజుల వరకూ అరెస్టు చేసే ఉద్దేశం లేదని హామీ ఇచ్చిన ఇ.డి నిజంగానే ఆరు మాసాల పాటు ఆమెకు వ్యవధి ఇచ్చింది. ఇక్కడ అది కూడా లేకుండా ఎకాఎకిని నిర్బంధంలోకి తీసుకున్నారంటే ముందే జరిగిన నిర్ణయమనేది స్పష్టం.
మామూలుగా ఒక ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి. ఢిల్లీకి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వుంటారు. నిజానికి గత ఎల్‌జిగా పని చేసిన తనే స్వయంగా కేజ్రీవాల్‌ ప్రభుత్వం పై కేసు పెట్టాలని ఆదేశించడం ఒక విపరీతం. కనుక అనుమతి ప్రశ్న లేకుండా పోయింది. ఆ తర్వాత కాలంలో చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు, విచారణలు జరిగినా నిర్దిష్టంగా నిరూపితమైంది లేదు. అందులోనూ కేజ్రీవాల్‌ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆధారాలేమీ లేవు. అసలు ఈ స్కామ్‌ అనబడేదాని ద్వారా వచ్చిందని చెబుతున్న మొత్తం వంద కోట్లు, ఇతరత్రా కలిపి ఇది రెండు వందల కోట్లు చూపిస్తున్నారు. వందలో నలభై కోట్లు గోవాలో ఎన్నికల కోసం పంపించారని ఆరోపణ. తన కంచుకోట వంటి ఢిల్లీలో చోటు లేకుండా చేయడమే గాక నెమ్మదిగా గుజరాత్‌లోనూ గోవాలోనూ కూడా సవాలు చేశారనేది ఆప్‌ పై బిజెపి ప్రత్యేక కక్ష. దేశమంతా తాము పాలిస్తుంటే ఆ పాలన జరిగే చోటును మరెవరో పాలించడం మోది బృందం ఎన్నడూ భరించలేకపోయింది. మధ్యతరగతి మద్దతుతో పట్టణ ప్రధానమైన సంస్కరణలతో కొంత సమాంతర పాలన అందించిన ఆప్‌ దేశ రాజకీయ పటంలో ఒక స్థానం సంపాదించుకుంది. నిజానికి ప్రాంతీయ పార్టీగా మొదలై జాతీయ పార్టీగా ఎదిగిన ప్రత్యేకత దానిదే. చాలా ప్రాంతీయ పార్టీలలో వలె ఒక నాయకుడి కుటుంబమే చక్రం తిప్పే సంస్కృతి ఆప్‌లో లేకపోవడం ఒక విశేషం. కేజ్రీవాల్‌ పాత్రనే ప్రధానంగా వున్నా పంజాబ్‌లో గెలిచిన తర్వాత అదీ కొంత మారింది. ఢిల్లీ ఓటర్లు కూడా శాసనసభకు ఆప్‌నూ లోక్‌సభకు బిజెపిని గెలిపిస్తూ మిశ్రమ చిత్రం సృష్టించారు. ఈ ద్వంద్వత్వం చాలా కాలం ఆప్‌పైనా ప్రభావం చూపింది. తొలి నుంచీ కక్ష
వాస్తవానికి కేంద్రపాలిత ప్రాంతంగా వుండి పరిమితమైన అధికారాలు గల రాష్ట్రంగా మార్చబడిన ఢిల్లీలో దీర్ఘకాలం బిజెపి హవా ఉండేది. దేశంలో కాంగ్రెస్‌ దెబ్బ తినిపోయినా అక్కడ మాత్రం షీలాదీక్షిత్‌ మూడు సార్లు ఎన్నికై సంచలనం సృష్టించారు. బిజెపిని దూరంగా ఉంచారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ బృంద సభ్యుడుగా ఉండి మార్పు కోసం ఆప్‌ స్థాపించిన కేజ్రీ ఈ నేపథ్యంలోనే రంగంలోకి వచ్చారు. తొలి ప్రయత్నంలోనే విభిన్న ప్రచారంతో ఎన్నికల్లో నెగ్గారు. అన్నాకు ఆయన రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. తన సూచనలను తోసిపుచ్చి ఆప్‌ ఏర్పడింది. తమాషా ఏమంటే కేంద్రంలో మోడీ, ఢిల్లీలో కేజ్రీ ఒకేసారి దేశం దృష్టికి వచ్చారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బిజెపిని, కాంగ్రెస్‌ను ఓడిస్తూనే ఆప్‌ నిలదొక్కుకుంది. మొహల్లా క్లినిక్‌లు, పాఠశాలల విషయంలోనూ, మహిళల ఉచిత ప్రయాణం వంటి వాటిలోనూ కొత్త వరవడి పెట్టింది. సమస్యలు లేవని కాదు గాని సమాంతర లక్షణాలు కనబరిచింది. ఈ కాలమంతటా అక్కడే వున్న కేంద్ర పెద్దలు సహకరించకపోగా అడుగడుగునా గండాలు సృష్టించారు. పోలీసు అధికారాలతో సహా కేంద్రం గుప్పిట్లో ఉన్నందున ప్రతిదానికి పేచీలు పెట్టారు. బిల్లుల పై సంతకాలు చేయకుండా ఎల్‌జి జంగ్‌ వేధించారు. చివరకు ఈ విషయంలో తమ రాజ్యాంగ హక్కుల కోసం సుప్రీం కోర్టులోనూ పోరాడిన కేజ్రీ ప్రభుత్వం విజయం సాధించింది. అంతకు ముందు కాలంలో ఢిల్లీ సర్కారు అంటే నామమాత్రపు అధికారాలనే భావన వుండేది. కేజ్రీవాల్‌ అలాగాక మిగిలిన రాష్ట్రాలతో పాటు ప్రాధాన్యత సాధించారు. గుజరాత్‌లో మంచి ఓటింగ్‌, పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జాతీయ పార్టీగా మారడం బిజెపి భరించలేని పరిస్థితిని సృష్టించింది. ప్రతి కాగితాన్నీ తప్పు పడుతూ ప్రతి చర్యనూ అడ్డుకుంటూ ముఖ్యమంత్రి పిఎ పైన, రాష్ట్ర ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శిపైన కూడా దాడులు చేశారు. అసలు అధికార యంత్రాంగం మొత్తం ఎల్‌జి అదుపులోనే ఉండాలని సుప్రీం కోర్టులో కేంద్రం వాదిస్తే న్యాయస్థానం తిరస్కరించింది. చివరకు ఈ లిక్కర్‌ స్కాం అనేదాన్ని పట్టుకున్నారు. చివరకు కేజ్రీ అరెస్టు వరకూ తీసుకెళ్లారు.
ఇకనైనా ఎదిరిస్తారా..??
గతంలో జయలలిత, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శిబు సొరేన్‌, మధు కోడా తదితరులు రకరకాల సందర్భాల్లో వివిధ కేసులలో జైలుకు వెళ్లిన మాట నిజమే గానీ వారు పదవులకు రాజీనామా చేసి లేదా కోల్పోయి వెళ్లారు. ఇక్కడ అధికార హోదాలోనే వెళ్లడం ఇదే తొలిసారి. ఒక విధంగా ఇది దేశంలో ప్రస్తుత పరిస్థితికి ప్రతిబింబమే. ప్రతిపక్ష నాయకులను, ప్రభుత్వాలను వెంటాడి వేటాడుతున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగానే ఆయనను అరెస్టు చేసింది. ఇందుకు ముందు రోజే న్యూస్‌ 18 సమిట్‌లో మాట్లాడుతూ మోది కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోలేదని అంతకు ముందు అనేవారని, తన హయాంలో చర్య తీసుకుంటే గోల చేస్తున్నారని అపహాస్యం చేశారు. నిజానికి ఆయన హయాంలో అవినీతి పేరిట అరెస్టు చేసిన వారిలో 95 శాతం ప్రతిపక్షానికి చెందినవారే. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్న దాడి అని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఈ సమయంలోనే ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి పది వేల కోట్లకు పైన వచ్చినట్టు అధికారికంగా వెల్లడైంది. అయినా తమ ఎంపీల సంఖ్యతో పోలిస్తే తక్కువే వచ్చిందని హోంమంత్రి అమిత్‌ షా బాహాటంగా వ్యాఖ్యానించారు. సరిగ్గా ఏ సంస్థల పైన ఇడి, సిబిఐ, ఐటి దాదులు జరిగాయో వాటి నుంచే వందల వేల కోట్లు బిజెపి కి ముట్టాయని ఇప్పుడు లెక్కలతో సహా తేలింది. ప్రధానికి సన్నిహితుడైన గౌతం అదానీ నిర్వాకాల పై అంతర్జాతీయ నివేదిక వస్తే విచారణ చేయకుండా మరింత వెసులుబాటు కల్పించారు. అమిత్‌ షా తనయుడైన జైషా మీద ఆరోపణలు వస్తే ప్రచురించిన మీడియా పై చర్య తీసుకున్నారు. ఇలా ఎన్ని సంస్థల నోరు నొక్కారో లెక్కలేదు. ఎన్నికల సంఘం కూడా వారి కనుసన్నల్లో పని చేసే పద్ధతి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు మాజీలకు పదవులిచ్చి, మరి కొందరిని అదరగొట్టి న్యాయాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్నారు.
రాజ్యాంగబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బేఖాతరు చేస్తూ కేంద్రీకృత పాలనకు బాట వేసుకుంటున్నారు. తమవైన మతతత్వ హిందూత్వ రాజకీయాలకు తోడు ఈ అప్రజాస్వామిక, నిరంకుశ పోకడలు దేశానికి ముప్పుగా మారుతున్నాయి. బడా మీడియా వంత పాడుతున్నందున ఇందుకు సంబంధించిన వివరాలు ప్రజలకు అందడం లేదు. అయినా అధికారం కోసం అనేక ప్రాంతీయ పాలక పార్టీలు వంత పాడుతున్న తీరుకు ఎపి, తెలంగాణ రాజకీయాలే నిదర్శనం. టిడిపి, జనసేన పూర్తిగా లొంగిపోగా వైసిపి పరోక్షంగా వత్తాసునిస్తూనే వుంది. ఇదే కేసులో వైసిపి ఎంపీలకు సంబంధించినవారు, బిఆర్‌ఎస్‌ సన్నిహితులు అప్రూవర్లుగా లొంగిపోయి వారు చెప్పినట్టు వింటుంటే ఆ పార్టీలు మాత్రం వత్తాసునిస్తూనే వున్నాయి. 2024 ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత జరుగుతున్న ఇంత అఘాయిత్యాన్ని ‘ఇండియా’ వేదిక ప్రతినిధులు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు కూడా. రాజకీయ సమాన అవకాశాలు లేకపోతే ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగే ప్రసక్తి వుండదు. వేల కోట్లు బాండ్ల సొమ్ము తీసుకున్న బిజెపి కేంద్రం కాంగ్రెస్‌ ఖాతాలు స్తంభించపేయడం ఇలాంటి వైపరీత్యమే. కేజ్రీవాల్‌ అరెస్టు ఈ దిశలో మరో అప్రజాస్వామిక ఘట్టం. కేరళలోనూ ఇలాగే చేయబోయి భంగపడ్డారని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికైనా అవకాశవాదం మాని ఈ నిరంకుశత్వాన్ని ప్రతిఘటించితేనే దేశానికి రక్ష. వచ్చే ఎన్నికల్లో బిజెపి కూటమికి దేశవ్యాపితంగా తిరుగులేని పాఠం చెబితేనే రక్షణ అన్నది మా వాదన.