స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 10 (ప్రజాజ్యోతి ) :- స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో సిపిఎం కార్యాలయంలో శనివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పార్టీ మండల కమిటీ సభ్యులు దైద రాములమ్మ, సిద్ధుల సుదర్శన్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడుతూ నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలు అని అన్నారు.
విస్నుర్ రాపాక రామచంద్రారెడ్డి గడీలను కూల్చిన యోధురాలని అన్నారు. నాడు నిజాం తెలంగాణలో దుష్ట పాలన కొనసాగిస్తూ దానికి మద్దతుగా గ్రామాలలో జమీందారులు జాగిర్దారులు పటేల్ పట్వారిలు ప్రజలను పన్నుల కట్టాలని పీడించే వారని అన్నారు. దొరలు తమ వ్యవసాయ పొలాలలో ఇంటిదగ్గర ప్రజలచే వెట్టి చాకిరి చేయించుకునే వారని, మహిళలపై అతి క్రూరంగా ప్రవర్తించే వారిని ఎదురు వచ్చిన వారిని అత్యాచారాలు చేసేవారని అన్నారు. ఇంతటి భయానకర పరిస్థితులలో నాడు రాపాక రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పాలకుర్తిలో చిట్యాల ఐలమ్మ తన ఇంటిని పార్టీ కార్యాలయంగా చేసుకొని దొరకు ఎదురు తిరిగి పోరాటం కొనసాగించిందని, ఎందరో మహిళలను కదిలించి పోరాటంలో నిలిపారని అన్నారు.
తాను కౌలుకు చేస్తున్న భూమిలో దొరలు పండిన పంటను ఎత్తుకెళ్లే క్రమంలో ఆంధ్ర మహాసభ సంఘం ఎర్రజెండా అండతో దొరలను ఉరికిచ్చి తన పంట కాపాడుకుందని అన్నారు. అంతటి మహత్తరమైన పోరాటాన్ని నేడు పాలకులు వక్రీకరించే పనిలో ఉన్నారని, ప్రజలు వాస్తవ చరిత్రను తెలుసుకొని నేటి పాలకులపై పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు చిలుముల్ల భాస్కర్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి శాతపురం రవి, నాయకులు కుర్ర అనిల్, పోలాసు సురేష్, సింగపురం రాజేందర్, గజ్జల శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు.
- 1 view