బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే కర్తవ్యం

Submitted by Satyanarayana on Thu, 15/09/2022 - 16:37
BJP's duty is to obstruct in Telangana

 

  • కూనంనేని సాంబ‌శివ‌రావుకు మంత్రి పువ్వాడ అజయ్ శుభాకాంక్ష‌లు
  • సీఎం కేసిఆర్ పోరాటంలో కలిసి రావాలి

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి'  భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులై మొదటి సారి ఖమ్మం విచ్చేసిన సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావుకు మంత్రి అజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.ప్రస్తుతం భారత దేశంలో ఆర్థిక సంక్షోభం, మతోన్మాదం నెలకొన్న నేపథ్యంలో దేశానికి కమ్యూనిస్టుల అవసరం పెరుగుతున్నదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు పురోగమిస్తున్నారని, పలు దేశాల్లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు విజయం సాధించడం ఇందుకు నిదర్శనమని అన్నారు. శ్రీలంక లాంటి పరిస్థితులే దేశంలో ఉన్నాయని, ఈ సంక్షోభానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని మంత్రి స్పష్టంచేశారు. దేశాన్ని అమ్ముకొంటున్న మోదీ పాలనకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెంటే కమ్యూనిస్టుల ప్రయాణం సాగాలని సూచించారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని పారద్రోలడానికి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప‌రిరక్షణకై మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే కర్తవ్యంగా భావించి కృషి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలను సంపూర్ణంగా సమర్ధించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలకు కాషాయ రాజకీయ పాలన ముప్పుగా మారిందని ఆ పార్టీ రాష్ర్టాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు అనే దుర్మార్గమైన సిద్ధాంతాలను పాటిస్తున్నదని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను డబ్బు పెట్టి కొనేందుకు దుకాణం మొదలెట్టిందని మంత్రి అజయ్ విమర్శించారు.