గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 : దళిత బంధు పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలలో కొత్త యూనిట్లను ఏర్పాటు చేసుకొని, లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లబ్ధిదారుల అవగాహన సదస్సుకు రాష్ట్ర షెడ్యూల్డ్ దళిత బంధు సలహాదారు (డైరీ) అడ్వైజర్ డాక్టర్ లక్ష్మారెడ్డి తో కలిసి, లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అనేకమంది దళితులకు ఆర్థికంగా చేయూతను అందించిందని తెలిపారు. దళిత బంధు పథకం కింద కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. అమర్ విశ్వనాథరాజు, నారాయణరాజు, శ్రీనివాస చారి, డిక్కీ, హైదరాబాద్ వారు పశుసంవర్ధక శాఖ కింద తీసుకుంటున్న యూనిట్ల ద్వారా ఎలా అభివృద్ధి సాధించాలని, పవర్ పాయింట్ స్క్రీన్ ద్వారా వివరించారు. పాల పరిశ్రమ ద్వారా నెలకు రూ. 80 వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ లబ్ధిదారులతో మాట్లాడుతూ, దళిత బందులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను వివరించారు. కోళ్ల పెంపకంలో షెడ్డు నిర్మాణంలో జాగ్రత్తలు, నిర్మాణ విధానం, గేదెల ఎంపిక, పచ్చిగడ్డి మొదలైన అంశాలు లబ్ధిదారులకు తెలియజేశారు. అడ్వైజర్ డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల కింద లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
వాటిలో మత్స్య పరిశ్రమ ద్వారా నేలకు రూ.25వేల నుండి రూ.30 వేల వరకు ఆదాయం ఉంటుందని అన్నారు. కూరగాయల సాగు చేసుకుని లబ్ధి పొందవచ్చు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాలు పారిశ్రామికంగా ఎదగాలని అన్నారు.అల్లం పేస్ట్ మిషెన్ రూ. 6 లక్షల ఖరీదు చేసి, దాని ద్వారా లబ్ధి పొందవచ్చు అని అన్నారు. పాడి గేదలు ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు వారి ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి, పాల ఉత్పత్తిలో ఎలాంటి మెలుకువలు పాటించాలి, పశుపోషణ తదితర అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఏడి రమేష్ బాబు, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారిని షకీలా భాను, గోవిందు నాయక్, శ్వేత ప్రియదర్శిని, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- 1 view