జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు, వారికి భరోసా కల్పించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ముందుకు వచ్చింది. మృతుల డెత్ క్లెయిమ్లను వేగంగా, సులభతరంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ దుర్ఘటన పట్ల ఎల్ఐసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. “పహల్గామ్ లో అమాయక పౌరుల మరణం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాం. మరణించిన వారి డెత్ క్లెయిమ్లను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి, బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికి ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తున్నాం” అని ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ సిద్ధార్థ మొహంతి ‘ఎక్స్’ ఖాతా ద్వారా తెలిపారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చారు.
ఎల్ఐసీ ప్రకటించిన దాని ప్రకారం, డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్లో జరుగుతుంది. క్లెయిమ్ చేయాలనుకునే నామినీలు, పాలసీదారు మరణానికి సంబంధించిన అవసరమైన పత్రాలతో, పాలసీని జారీ చేసిన ఎల్ఐసీ బ్రాంచ్ను నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది.
పాలసీ ప్రీమియంలు సక్రమంగా చెల్లిస్తూ, పాలసీ యాక్టివ్గా ఉన్నట్లయితే లేదా గ్రేస్ పీరియడ్లోపు మరణం సంభవించినట్లయితే, క్లెయిమ్ సెటిల్మెంట్కు అర్హత ఉంటుందని ఎల్ఐసీ తెలిపింది. అవసరమైన పత్రాలను పరిశీలించిన అనంతరం, ఎల్ఐసీ క్లెయిమ్ మొత్తాన్ని త్వరితగతిన పరిష్కరిస్తుంది. ఈ చర్య ద్వారా బాధిత కుటుంబాలకు కొంత ఊరట కల్పించాలని ఎల్ఐసీ భావిస్తోంది.