*తెలంగాణకు అన్యాయం జరిగితే సహించం: రంజిత్ రెడ్డి*
*జనగణనతో పాటే కుల గణన చేపట్టాలి: కాంగ్రెస్ డిమాండ్*
వరంగల్, ఏప్రిల్ 17 (ప్రజా జ్యోతి)::
నెక్కొండలో జరిగిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ సభ్యులు రంజిత్ రెడ్డి, మండల అధ్యక్షుడు తిరుమల్ చౌహన్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగితే ఊరుకోబోమని వారు హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన శాస్త్రీయంగా సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూనే, 2027 జనగణనతో పాటు తప్పనిసరిగా కుల గణన చేపట్టాలని నేతలు కోరారు. మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉప కోటా కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేలా చట్టం చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొని ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
