కడ్లాపూర్ రైతుల దీక్షకు మద్దతుగా వెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అరెస్ట్

రంగాపూర్ చౌరస్తా వద్ద అడ్డుకున్న పోలీసులు – చెంగోముల పోలీస్ స్టేషన్కు తరలింపు, పోలీసులతో వాగ్వాదం
పరిగి, జూన్ 12 (ప్రజాజ్యోతి):
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామ రైతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇవ్వవద్దంటూ గ్రామ సర్పంచ్తో పాటు రైతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో రంగాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పోలీసుల చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “మేమేమైనా దొంగలమా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?” అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం పోలీసులు మహేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని మన్నెగూడ–చెంగోముల పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడం సరైంది కాదని మహేష్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది.
కడ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదన నేపథ్యంలో రైతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్తో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
