గరిడేపల్లి,జూలై 21(ప్రజా జ్యోతి):విద్యార్థులకు నాణ్యమైన,గుణాత్మకమై న విద్యను అందించడంలో ఉపాధ్యా యుల పాత్ర అత్యంత కీలకమని మండల విద్యాధికారి (ఎంఈవో) పానుగోతు చత్రు నాయక్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గరిడేపల్లిలో ఎస్జీటీ ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ శిక్షణ తొలి స్పెల్ తొలి రోజు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చదవడం,రాయడం గణితంలో నాలుగు ప్రాథమిక ప్రక్రియల పై పట్టు పెంపొందించడం,అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యమని తెలిపారు.ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యా యులను మరింత సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఉపాధ్యాయులు ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని,ఆ నైపుణ్యాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచాలని ఎంఈవో సూచించారు.రిసోర్స్ పర్సన్లుగా జి. దయాకర్,ఆర్.రవీందర్,పి.పాపయ్య, పి.రాంబాబు,బి.కోటేశ్వరరావు శిక్షణ అందించగా,ఈ శిక్షణ కార్యక్రమంలో మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు,సీఆర్పీలు ఆర్. రామకృష్ణ,ఈ.అశోక్ కుమార్, వై.ఉమా తదితరులు పాల్గొన్నారు.
