దూసుకెళుతున్న పసిడి ధర… హైదరాబాదులో 10 గ్రాములు ఎంతంటే

V. Sai Krishna Reddy
1 Min Read

బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం సాయంత్రానికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,40,820 పలికి, సరికొత్త ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. పసిడి ధరల పరుగు దేశవ్యాప్తంగా ఇదే రీతిలో కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే రూ.2,650 పెరిగి రూ.1,40,850కి చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే పసిడి ధర ఏకంగా రూ.61,900 మేర పెరగడం గమనార్హం. 2024 డిసెంబర్ 31న రూ.78,950గా ఉన్న ధర, ఇప్పుడు 78 శాతం వృద్ధితో లక్షన్నర రూపాయల మార్కు దిశగా దూసుకెళుతోంది.

బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర ఒక్కరోజులో రూ.2,750 పెరిగి రూ.2,17,250కి చేరింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో వెండి ధర ఏకంగా 142 శాతానికి పైగా పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,500 డాలర్లకు, వెండి 70 డాలర్లకు చేరడమే దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు, భౌగోళిక అనిశ్చితుల కారణంగా మదుపర్లు బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ వివరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ గణాంకాలపై వెలువడనున్న అంచనాలు భవిష్యత్తులో ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *