పరిగి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న టూరిస్ట్ బస్సు.. నలుగురి దుర్మరణం

V. Sai Krishna Reddy
1 Min Read

వికారాబాద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక టూరిస్ట్ బస్సులో పరిగిలో జరిగిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. విందు ముగించుకుని తిరిగి తమ గ్రామానికి పయనమయ్యారు. ఈ క్రమంలో, వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌ సమీపంలో బీజాపూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై అప్పటికే నిలిపి ఉంచిన ఒక లారీని వీరు ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ప్రమాదంలో 20 మందికిపైగా గాయపడగా వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన వారు విందు నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనతో చెన్వెళ్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *