పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం విదితమే. పాకిస్థాన్పై భారత్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్లోని పాక్ జాతీయులను దేశం నుంచి వెళ్లగొట్టడమే కాకుండా సింధు నదీ జలాల ఒప్పందం రద్దు, పాక్ విమానాలకు భారత గగన తలం మూసివేయడం, దిగుమతులను స్తంభింపజేయడం వంటి చర్యలతో పాక్ను అన్ని వైపుల నుంచి ఇబ్బంది పెట్టే చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలోనే భారత్ ప్రతికార దాడి చేస్తుందన్న భయాందోళనలతో పాక్ మిత్ర దేశాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పాక్ తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా భారత్కు సమాచారం అందింది. అందుకు బలం చేకూరేలా తాజాగా టర్కీకి చెందిన టీజీసీ బుయుకడా అనే భారీ యుద్ధ నౌక పాక్ తీరాన్ని చేరింది.
ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న క్రమంలో భారత్ ఏ క్షణమైనా ఎదురుదాడి చేసే అవకాశం ఉందని పాక్ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే సముద్రమార్గంలోనూ దాడి చేసే అవకాశం ఉన్నందున తన మిత్రదేశం టర్కీని సంప్రదించి గస్తీ యుద్ధనౌకను తెచ్చుకున్నట్లు సమాచారం.
పాక్ తీరానికి చేరుకున్న టర్కీ యుద్ధ నౌక ‘టీజీసీ బుయుకడా’ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 2013లో జలప్రవేశం చేసింది. ఈ యుద్ధ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పని చేయగలదు. గస్తీ కాయడంలో దీనిది అందెవేసిన చేయి. పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.