రైతు భూమికి భరోసా భూ భారతి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
* గతంలో రైతులే కాదు అధికారులం ఇబ్బంది పడ్డాం
* రైతుల సమస్యలు పరిష్కరించలేక పోయాం
* భూ భారతి తో రైతు భూ సమస్యలకు పరిష్కారం
* తమకు న్యాయం చేయాలంటూ తల్లి కొడుకులు ఆత్మహత్యయత్నం
* పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తానన్న జిల్లా కలెక్టర్
చింతలపాలెం ఏప్రిల్ 30 (ప్రజా జ్యోతి) : భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. ధరణి లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘భూభారతి’ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చింతలపాలెం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఇప్పుడు భూ రికార్డులు భవిష్యత్ తరాలకు కూడా స్పష్టత కలిగేలా భూ భారతి వ్యవస్థ రూపొందించబడింది. ఏ భూమికి ఎవరి హక్కు ఉంటుందో, ఎలాంటి వివాదాలు ఉన్నాయో అన్నీ డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంటాయి,” అని అన్నారు. గతంలో వచ్చిన పొరపాట్లను సవరించుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉందని తెలిపారు. గతంలో ధరణి వల్ల భూ సమస్యలకు న్యాయం చేయలేకపోయామని, ఇప్పుడు తహశీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. దాన్ని వల్ల అధికారులు కూడా అనేక ఇబ్బంది పడ్డామని న్యాయం చేయాలని ఉన్న ధరణి వల్ల న్యాయం చేయలేకపోయామని వివరించారు. భూ భారతి ద్వారా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో శ్రీనివాసులు, హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక దేశ్ ముఖ్, అగ్రికల్చర్ ఏడి రవీందర్ నాయక్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ సురేందర్ రెడ్డి, ఎంపీడీవో భూపాల్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వేమూలూరి రంగాచారి, కలగొట్ల కోటిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది, రైతులు, మహిళలు పాల్గొని తమ సందేహాలను వ్యక్తీకరించారు. ప్రత్యక్షంగా స్పందించి రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామని అన్నారు.
*భూ భారతి అవగాహన సదస్సులో ఆత్మహత్యాయత్నం*
సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలంలో భూ భారతి అవగాహన సదస్సులో తమ భూమి విషయంలో రైతు దొంగల నాగరాజు వంటి పై పెట్రోల్ పోసుకోగా, తల్లి వీరమ్మ పురుగుల మందు తీసుకొని వచ్చి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు, రైతులు అడ్డుకొని వారికి సర్ది చెప్పారు. అనంతరం ఈ ఘటనపై సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ స్పందించారు. ఇటువంటి ఇబ్బందులు రావద్దని తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని. దీనివల్ల నిజమైన రైతుకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సమస్యలో పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..