- గ్రీన్ ఫీల్డ్ రైతులకు భూ పరిహారం డిపాజిట్ చేయాలి
- హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
- గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూముల అంశంపై జిల్లా కలెక్టర్ తో సమావేశమైన ఎన్ హెచ్ అధికారులు
హనుమకొండ / దామెర, అక్టోబర్ 13 (ప్రజాజ్యోతి):
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టులో భాగంగా భూ సేకరణ పూర్తయిన పరకాల డివిజన్ పరిధిలోని పరకాల, దామెర, శాయంపేట మండలాలకు చెందిన 10 గ్రామాల రైతులకు పరిహారం చెల్లించేందుకు జాతీయ రహదారుల శాఖ డిపాజిట్ చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163 జి ప్రాజెక్టులో భాగంగా పరకాల డివిజన్ పరిధిలో భూసేకరణలో భాగంగా సేకరించిన భూములకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో జాతీయ రహదారుల శాఖ వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ కీర్తి భరద్వాజ్ , అధికారులు సోమవారం సమావేశమయ్యారు.
ఆర్బిట్రేషన్ ఆర్డర్స్ ఇచ్చిన కూడా ఇంకా ఈ మండలాల పరిధిలోని 10 గ్రామాలకు చెందిన 110 కేసులలో మొత్తం పరిహారం రూ.7.52 కోట్లు, బావులు చెట్లు తదితర స్ట్రక్చర్ కి సంబంధించి రూ.6.50 కోట్లు రావాల్సి ఉండగా వీటిపై కలెక్టర్ సమీక్షించారు. రైతులకు అందించాల్సిన పరిహారం సంబంధించి త్వరగా డిపాజిట్ చేయాలని కలెక్టర్ సూచించారు. కాగా పరిహారం పొందిన తర్వాత కూడా కొందరు రైతులు భూమి మోకాపై ఉండి పంటలు వేసుకున్నారని, ఆ భూములను జాతీయ రహదారుల శాఖకు అప్పగించాలని ఎన్ హెచ్ పిడి జిల్లా కలెక్టర్ ను కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, సూపరింటెండెట్ జగత్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.