రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలకు సీసీ కెమెరాలను అమర్చడం సాధారణంగా చూస్తుంటాం.. వీధుల్లో రాకపోకలు సాగించే వారిపై నిఘా ఉంచడానికి, దొంగతనాలు సహా ఇతర నేరాలను అరికట్టడానికి పోలీసులు వాటిని ఏర్పాటు చేస్తుంటారు. సాధారణంగా ఒక స్తంభానికి నాలుగు దిక్కులను కవర్ చేయడానికి నాలుగు సీసీ కెమెరాలు అమరుస్తుంటారు. అలాంటిది హుజురాబాద్ లోని ఓ విద్యుత్ స్తంభానికి ఏకంగా 40కి పైగా సీసీ కెమెరాలు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ మార్గంలో వెళ్లే ప్రజల దృష్టి కచ్చితంగా ఈ స్తంభంపై పడుతోంది. ఒకేచోట, ఒకే స్తంభానికి ఇన్ని కెమెరాలు ఎవరు, ఎందుకు అమర్చారనే ప్రశ్న వారిలో కలగకమానదు. నిజానికి ఇన్ని కెమెరాలను అమర్చడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే. స్థానికంగా సీసీ కెమెరాలను విక్రయించే ఓ వ్యాపారి చేసిన వినూత్న ఆలోచన ఇది.
అసలు విషయమేంటంటే..
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో వివేకానంద సెంటర్ నుంచి పీఎస్ఆర్ సెంటర్ వైపు వెళ్లే దారిలో ఓ వ్యక్తి సీసీ కెమెరాల వ్యాపారం చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లే వారి దృష్టిని ఆకర్షించడానికి, తన వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా చేయడానికి ఆయన ఒకే స్తంభానికి పదుల సంఖ్యలో సీసీ కెమెరాలను అమర్చారు. పాడైపోయిన సీసీ కెమెరాలను ఈ విధంగా ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారు.