జపాన్‌ను వణికిస్తున్న సునామీ జోస్యం.. భయంతో పర్యాటక రంగం అతలాకుతలం

V. Sai Krishna Reddy
2 Min Read

జపాన్‌లో ఓ కామిక్ పుస్తకం (మాంగా) సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. “నేను చూసిన భవిష్యత్తు” (The Future I Saw) అనే పేరుతో వచ్చిన ఈ మాంగాలో పేర్కొన్న ఓ జోస్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జులై 5, 2025న పెను సునామీ జపాన్‌ను అతలాకుతలం చేస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు, పర్యాటకులు భయాందోళనలకు గురవుతున్నారు.

రియో తత్సుకి అనే రచయిత్రి ఈ మాంగాను 2021లో రాశారు. గతంలో ఆమె 2011 నాటి భారీ భూకంపాన్ని ఊహించారని ప్రచారం జరగడంతో, తాజా జోస్యానికి ప్రాధాన్యం పెరిగింది. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో భారీ పగుళ్లు ఏర్పడి 2011 నాటి సునామీ కన్నా మూడు రెట్లు పెద్ద విపత్తు సంభవిస్తుందని అందులో పేర్కొన్నారు. ఈ ప్రచారం హాంగ్‌కాంగ్, తైవాన్, చైనా వంటి తూర్పు ఆసియా దేశాల్లో వేగంగా వ్యాపించడంతో, జపాన్‌కు పర్యాటకుల రాకపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఈ పుకార్ల కారణంగా జపాన్ పర్యాటక రంగం ఇప్పటికే కుదేలవుతోంది. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించగా, పర్యాటక బుకింగ్‌లు 30 శాతం వరకు పడిపోయాయి. ముఖ్యంగా టొట్టోరి ప్రాంతంలో హాం‌కాంగ్ నుంచి వచ్చే బుకింగ్‌లు ఏకంగా 50 శాతం తగ్గాయి. ఈ పుకార్ల వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థకు సుమారు 560 బిలియన్ యెన్ల (దాదాపు 3.9 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నోమురా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు అంచనా వేశారు.

అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని నిపుణులు, జపాన్ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నాయి. భూకంపాలను కచ్చితంగా అంచనా వేయడం అసాధ్యమని జపాన్ వాతావరణ సంస్థ తేల్చిచెప్పింది. “ఇలాంటి ఆధారం లేని పుకార్లు పర్యాటకాన్ని దెబ్బతీయడం తీవ్రమైన సమస్య” అని మియాగి ప్రావిన్స్ గవర్నర్ యోషిహిరో మురాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ మాంగా రచయిత్రి రియో తత్సుకి సైతం ప్రజలు ఆందోళన చెందవద్దని, నిపుణుల మాటలను విశ్వసించాలని కోరారు. అయినప్పటికీ, సోషల్ మీడియా పుకార్ల ప్రభావం కొనసాగుతూనే ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *