స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఒకరి రిపోర్ట్ మరొకరికి ఇవ్వడంతో మెడిసిన్ డోస్ ఎక్కువై గర్భిణీ ఆసుపత్రి పాలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన ఆరు నెలల గర్భిణీ పండూరి అనూష వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 19న ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళింది. అక్కడ పరీక్షించిన వైద్యురాలు ఆల్ఫా స్కానింగ్ సెంటర్కు రిఫర్ చేశారు. వైద్యురాలి సూచన మేరకు ఆల్ఫా స్కానింగ్ కు వెళ్లిన అనూషకు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు స్కానింగ్ నిర్వహించారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అనూషకు స్కానింగ్ నిర్వహించి జ్యోతి అనే 9 నెలల గర్భిణీ రిపోర్టులను జత చేసి అందజేశారు. అదే స్కానింగ్ రిపోర్టులతో వైద్యురాలు వద్దకు వెళ్ళిన అనూషకు సదరు వైద్యురాలు రిపోర్టులు పరిశీలించి మందులు రాశారు. అక్కడనుండి ఇంటికి వెళ్లిన అనంతరం మందులు వాడుతున్న క్రమంలో సదరు గర్భిణీకి కడుపులో నొప్పి రావడం మొదలైంది. అస్వస్థతకు గురయింది. ఈ క్రమంలో వారం రోజులు తర్వాత స్కానింగ్ సెంటర్ నుండి ఫోన్ చేసి తమ రిపోర్టు ఒకటి మీ వద్ద ఉండిపోయిందని తెచ్చి ఇవ్వాలని తెలిపారని.
అదేమిటని పరిశీలించగా అనూష కు బదులు జ్యోతి అనే గర్భిణీ రిపోర్టు ఉండటంతో అవ్వాక్కై వెంటనే సదరు వైద్యురాలు వద్దకు అనూష కుటుంబ సభ్యులు వెళ్లి ప్రశ్నించగా తనకేమీ తెలియదని తాను పేర్లు చూడలేదని మీరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను అడగాలని చెప్పడంతో అక్కడికి చేరుకున్న అనూష కుటుంబ సభ్యులు ఇదేమిటని ప్రశ్నించటంతో స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన గర్భిణీ కుటుంబ సభ్యులు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. తప్పుడు రిపోర్టు ఇవ్వటమే కాక ప్రశ్నించిన తమపై స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు అనూషకు మరల స్కానింగ్ నిర్వహించి రిపోర్ట్ అందజేశారు.