భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్రతరమవుతున్న ఉద్రిక్తతల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గడానికి తాను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ ఉద్రిక్తతలు వెంటనే ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన బుధవారం వాషింగ్టన్లో తెలిపారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతీకారంగా, భారత్ బుధవారం తెల్లవారుజామున “ఆపరేషన్ సిందూర్” చేపట్టింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మరియు పాకిస్థాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు నిర్వహించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ, “ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. నాకు రెండు దేశాలతో సత్సంబంధాలున్నాయి. ఇరు దేశాల నేతలూ నాకు సుపరిచితులే. వారు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఘర్షణలు ఆగిపోవాలి, తక్షణమే ఆగుతాయని ఆశిస్తున్నాను. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు, ఇది ఇకనైనా ఆగిపోవాలి. నాకు రెండు దేశాలతో మంచి సంబంధాలున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించడానికి నేను ఏదైనా చేయగలిగితే, తప్పకుండా చేస్తాను,” అని భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇదే విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా స్పందించారు. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులను తాను నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు. “ఎక్స్” వేదికగా ఆయన స్పందిస్తూ, “అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను నేను సమర్థిస్తున్నాను. ఈ ఉద్రిక్తతలు త్వరగా ముగిసిపోవాలని ఆశిస్తున్నాను. శాంతియుత పరిష్కారం కోసం భారత్, పాకిస్థాన్ నాయకత్వంతో చర్చలు కొనసాగిస్తాను,” అని పేర్కొన్నారు.