ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్లాకింగ్ పనుల నేపథ్యంలో 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా, 9 రైళ్లను దారి మళ్లించారు. అలాగే, గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్ప్రెస్ రైళ్లు 11 రోజులపాటు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.
సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ (17201/170202)ను 11వ తేదీ నుంచి 21 వరకు, సికింద్రాబాద్-సిర్పూరు కాగజ్నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (17233/17234) రైలును 10 నుంచి 21 వరకు రద్దు చేశారు.
అలాగే, గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (12705/12706)ను 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో.. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్ (1713/12714)ను 11, 14, 16, 18, 19, 20, తేదీల్లో రద్దు చేశారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ (20834) 19, 20 తేదీల్లో 75 నిమిషాలు, ఆదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ (17406) 9, 11, 14, 19 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతాయని రైల్వే అధికారులు తెలిపారు.