ఇస్లామాబాద్ లో భారీ పేలుడు… 15 మంది మృతి

V. Sai Krishna Reddy
1 Min Read

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. శుక్రవారం జుమ్మా ప్రార్థనల సమయంలో ఓ షియా మసీదు లక్ష్యంగా జరిగిన ఈ భీకర దాడిలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను స్థానిక అధికారులు ధృవీకరించారు.

ఇస్లామాబాద్‌లోని ఆగ్నేయ ప్రాంతమైన తర్లాయ్ కలాన్‌లోని ఖదీజతుల్ కుబ్రా మసీదులో ఈ ఘటన చోటుచేసుకుంది.

శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైన సమయంలో పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మసీదు ప్రధాన ద్వారం వద్ద దుండగుడు తనను తాను పేల్చుకుని ఉండవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడిని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. గత ఏడాది నవంబర్‌లో ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ తాజా ఘటనతో రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *