పల్నాడులో మళ్లీ రక్తపాతం.. వేట కొడవళ్లతో నరికి ఇద్దరు అన్నదమ్ముల హత్య

V. Sai Krishna Reddy
1 Min Read

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో మరోసారి నెత్తురు పారింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు వేట కొడవళ్లతో వారిని కిరాతకంగా నరికి చంపారు. మృతులను టీడీపీ కార్యకర్తలైన కొత్త హనుమంతరావు, కొత్త శ్రీరామమూర్తిగా పోలీసులు గుర్తించారు. ఈ జంట హత్యలతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వీరిపై ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడ్డారు. గ్రామ శివారులోని ఓ బండరాయి వద్ద హనుమంతరావు మృతదేహం లభించగా, నీలంపేట అమ్మవారి గుడి దగ్గర ఉన్న వాటర్ ప్లాంట్ సమీపంలో శ్రీరామమూర్తిని హతమార్చారు. ఇద్దరినీ అత్యంత పాశవికంగా వేట కొడవళ్లతో నరకడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాలు ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నప్పటికీ, రాజకీయ కోణాన్ని కూడా తోసిపుచ్చడం లేదు.

ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆ గ్రామ సమీపంలోని గుండ్లపాడు గ్రామంలో ఇలాగే జంట హత్యలు జరిగాయి. ఆ ఘటన నుంచి తేరుకోకముందే ఇప్పుడు జరిగిన ఈ హత్యలతో పల్నాడు వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *