హైదరాబాద్ సహా రాష్ట్రమంతా చలి పంజా.. కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్‌తో పాటు అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి.

ఆదివారం రాత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నిర్మల్ సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.1 డిగ్రీలుగా నమోదు కావడం గమనార్హం. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్ని జిల్లాల్లో సగటున 8.6 నుంచి 13.5 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *