ఢిల్లీలో వైఎస్సార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు

V. Sai Krishna Reddy
1 Min Read

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ తన సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్ రింగు రోడ్డు, పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాల ద్వారా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నదే వైఎస్సార్ ఆశయమని, ఆయన కలను నెరవేర్చేందుకు తామంతా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

అనంతరం, మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా చంద్రశేఖర్ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ నేతగా కీలక విధాన నిర్ణయాల్లో పాలుపంచుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *