జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున తాను పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు. గురువారం బంజారాహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను గుర్తుచేసుకుంటూ చివరి క్షణంలో టికెట్ కేటాయించినప్పటికీ, నియోజకవర్గంలో తాను గట్టి పోటీ ఇచ్చానని అజారుద్దీన్ తెలిపారు. చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశానని అన్నారు. అయితే, రానున్న ఉప ఎన్నికలో తనకు టికెట్ లభించదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వదంతులను నమ్మవద్దని కోరారు.
ఈసారి జరగబోయే ఉప ఎన్నికలో తాను తప్పకుండా విజయం సాధిస్తానని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరి సహకారంతో గెలుపొంది, ఆ విజయాన్ని రాహుల్ గాంధీకి కానుకగా అందిస్తానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని అజారుద్దీన్ తెలిపారు.