తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి, అంటే జూన్ 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది.
పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగుతుంది.
వివిధ తేదీల్లో పేపర్ల వారీగా పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది:
పేపర్-2 పరీక్షలు జూన్ 18, 19, 24 (మొదటి షిఫ్టు మాత్రమే), 28, 29, 30 తేదీలలో జరుగుతాయి.
పేపర్-1 పరీక్షలు జూన్ 20, 23, 24 (రెండవ షిఫ్టు మాత్రమే), 27 తేదీలలో నిర్వహించనున్నారు.
ఈ ఏడాది టెట్ కోసం ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 1.83 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో పేపర్-1 కోసం 63,261 మంది, పేపర్-2 కోసం 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లకూ కలిపి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య సుమారు 15 వేల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.