నేను ఉన్నంత కాలం కాంగ్రెస్‌లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదు: రేవంత్ రెడ్డి

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను పదవిలో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ఆ కుటుంబమే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన శత్రువని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మంత్రులకు శాఖల కేటాయింపు అంశంపై ఢిల్లీలో అధిష్ఠానంతో ఎటువంటి చర్చలు జరగలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పార్టీలోని ముఖ్య నేతలందరితో సంప్రదింపులు జరిపి, ఆ తర్వాతే శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా కర్ణాటకలో కులగణన అంశంపై మాత్రమే అధిష్ఠానంతో చర్చించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాబోయే రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను బహిర్గతం చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, ఇతర అంశాలపై స్పష్టత ఇస్తామని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోయారని ఆయన విమర్శించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *