కాళేశ్వరం విచారణ.. కమిషన్ ముందు హాజరైన మాజీ సీఎం కేసీఆర్

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ముందు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం హాజరయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.

వివరాల్లోకి వెళితే… హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ కార్యాలయానికి కేసీఆర్ ఉదయం 11 గంటల తర్వాత చేరుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోశ్‌ నేతృత్వంలోని ఈ కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, నాణ్యతా లోపాలపై విచారణ జరుపుతోంది.

సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి చెందిన కొంత భాగం కుంగిపోవడంతో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కమిషన్ ముందు హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వంటి కీలక వ్యక్తులను కమిషన్ విచారించిన సంగతి తెలిసిందే.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *