ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద మృతి

V. Sai Krishna Reddy
1 Min Read

ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందిన యువ యూట్యూబర్ మధుమతి (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం ఏ. కొండూరు గ్రామానికి చెందిన మధుమతి, చిన్న వయసులోనే యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆన్ లైన్ వేదికగా ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల తన స్వగ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మధుమతి, అక్కడే ఉరివేసుకుని మరణించినట్లు తెలుస్తోంది.

అయితే, మధుమతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వివాహితుడైన ప్రతాప్ తో మధుమతికి పరిచయం ఉందని, అది వివాహేతర సంబంధానికి దారితీసిందని తెలుస్తోంది. ప్రతాప్ వేధింపులు తాళలేకనే మధుమతి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మధుమతి మరణాన్ని అనుమానాస్పద మృతిగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు, ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే మధుమతి మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *