వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ గోశాలలోకి అడుగు పెట్టేందుకు యత్నించిన అభినయ్ ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
ఈ సందర్భంగా అభినయ్ రెడ్డి మాట్లాడుతూ… గోశాలకు రావాలంటూ టీడీపీ చేసిన ఛాలెంజ్ ను స్వీకరించి గోశాలకు వచ్చామని… కానీ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ తమను అడ్డుకుందని విమర్శించారు. సవాళ్లను స్వీకరించి వచ్చినప్పుడు పోలీసులతో తమను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రమ్మంటారు… వస్తే అడ్డుకుంటారు… ఇదేనా మీ సంస్కారం? అని మండిపడ్డారు.
మరోవైపు తిరుపతిలోని భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ గురుమూర్తితో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి గోశాలకు వెళ్లేందుకు బయల్దేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం గన్ మన్లతోనే గోశాలకు వెళ్లాలని, అనుచరులతో వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులతో వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు.