సిద్ధిపేట రూరల్ ,జులై 30,(ప్రజాజ్యోతి):మెదక్ జిల్లా ఏడుపాయల దేవస్థానం దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.బాధితుడు బెజిగం వినేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు మెదక్ జిల్లాలోని ఏడుపాయల దేవస్థానానికి వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం అల్లుడు ద్వారకేష్ కారు (TS 36 N 4995)లో బెజిగం శ్రీలత (39), లిఖిత్ (18), శ్రీమాన్ (10), శ్రేష్ఠ (12)లను తీసుకుని సిద్దిపేటకు బయలుదేరాడు.సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోర్నాల గ్రామ శివారులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపానికి చేరుకోగానే డ్రైవర్ కారు అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి పల్టీలు కొడుతూ రహదారి పక్కనున్న వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో బెజిగం శ్రీలత (39) తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో ఉన్న లిఖిత్ (18), శ్రీమాన్ (10), శ్రేష్ఠ (12)లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బాధితుడు బెజిగం వినేష్ కుమార్ ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
