ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా రేపటితో ముగియనుంది. 144 ఏళ్లకు ఓసారి వచ్చే కుంభమేళా కావడంతో కోట్లాది మంది భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళాకు వెళ్లని వారు తమ బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ద్వారా పవిత్ర గంగాజలాన్ని తెప్పించుకొని మీద జల్లుకుంటున్నారు. ఇంకొందరు కుంభమేళాకు రాని తమ వారి పేర్లను చెబుతూ పుణ్యస్నానమాచరిస్తున్నారు. మరికొంతమంది ఆత్మీయుల ఫొటోలను పవిత్ర గంగలో ముంచి తీస్తున్నారు.
అయితే, కుంభమేళాలో ఒక మహిళ తన భర్త కోసం చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. కుంభమేళాకు వెళ్లిన మహిళ తాను పుణ్యస్నానమాచరించిన అనంతరం, తన భర్తకు ఫోన్ చేసి, ఆ ఫోన్ను మూడుసార్లు నీట ముంచింది. తద్వారా తన భర్తకు పుణ్యస్నానమాచరించిన అనుభూతిని మిగిల్చే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్ను పలుమార్లు గంగలో ముంచిన ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.