రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు 24 గంటలూ తెరుచుకునేందుకు అనుమతినిస్తూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు నిబంధనల మేరకు వేతనాలు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.
చట్టంలోని నిబంధనల ప్రకారం, రోజుకు ఎనిమిది గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేసే ఉద్యోగులకు రెండింతల వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఉద్యోగులు సెలవు రోజుల్లో పనిచేస్తే ప్రత్యామ్నాయ సెలవు ఇవ్వాలని ఆదేశించారు. మహిళా ఉద్యోగులు రాత్రి వేళల్లో పని చేసేందుకు జీవో 476ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.