ఆకలితో ఉన్న యాచకులకు అన్నదానం
సేవా భావంతో లయన్ జోన్ చైర్మన్ సీతలే రమేష్
బీర్కూర్, ప్రజాజ్యోతి సెప్టెంబర్ 11:
- రాత్రి వేళల్లో తినడానికి ఆహారం లేక ఆకలితో బస్టాండ్ ఆవరణలో ఉంటున్న యాచకులకు లయన్ జోన్ చైర్మన్ సీతలే రమేష్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా యాచకులకు సమోసా, బ్రెడ్, తాగునీటిని అందించి వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా సీతలే రమేష్ మాట్లాడుతూ.. సమాజంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, కనీసం తినడానికి ఆహారం కూడా దొరకని వారు ఎంతోమంది ఉన్నారని అన్నారు. మనకు ఉన్నదానిలో కొంత భాగాన్ని అవసరమైన వారికి అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో ఆకలితో కనిపించే వారికి వీలైనంత సహాయం చేయాలని సూచించారు.
“అన్నదానం అంటే ఉన్నవారు తినడం కాదు.. అన్నం లేనివాడికి పెట్టడమే నిజమైన అన్నదానం” అని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి నిరుపేదలు, నిరాశ్రయులు, యాచకులు ఉన్నారని, వారిని గుర్తించి అప్పుడప్పుడు ఆహారం అందించాలని పిలుపునిచ్చారు.
అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటు సేవా భావాన్ని కూడా అలవాటు చేయాలని సూచించారు. చిన్న వయస్సు నుంచే ఇతరులకు సహాయం చేసే గుణాన్ని పెంపొందిస్తే భవిష్యత్లో సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదుగుతారని అన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత మేరకు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని కోరారు.
